"ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ NDA వ్యూహం ఇదే!"

Amruth kumar
ఎన్డీయే కూటమి చివరికి తన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఫైనల్ చేసింది. ఎన్నో పేర్లు తెరమీదకు వచ్చాయి, అనేక సమీకరణాలు నడిచాయి, కానీ ఆఖరికి అదృష్టం వరించింది మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు. తమిళనాడు వాసి అయిన ఆయనకు దక్షిణాది రాజకీయాలతోపాటు జాతీయ స్థాయిలోనూ మంచి అనుభవం ఉంది. తెలంగాణ గవర్నర్ ఇన్‌ఛార్జ్‌గా కూడా కొంతకాలం పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లభించిన ఉప రాష్ట్రపతి అవకాశం, దక్షిణాదిని టార్గెట్ చేస్తూ బీజేపీ వేసిన మాస్టర్ స్ట్రోక్‌గా భావిస్తున్నారు.



సంఘ్‌తో అనుబంధం :
రాధాకృష్ణన్ ఎంపిక వెనుక కీలక కారణాల్లో ఒకటి ఆయన ఆరెస్సెస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌) తో ఉన్న గాఢ అనుబంధమే అని అంటున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన సంఘ్‌ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండి, అదే బాటలో ప్రయాణించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాది వాసి, ఒడిశాకు చెందిన వారు. దాంతో ఈసారి దక్షిణాదినుంచి ఓ నాయకుడిని ఎంపిక చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. అలా సీపీ రాధాకృష్ణన్ పేరు ఫైనల్ అయింది.



రాజ్‌నాథ్ పేరు కూడా తెరపైకి :
ఉప రాష్ట్రపతి పదవికి ఒక దశలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు కూడా చర్చకు వచ్చింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చాలామంది ఆయన పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు బయటకొచ్చాయి. కానీ రాజ్‌నాథ్ మాత్రం "నేను ప్రభుత్వంలోనే కొనసాగుతాను" అంటూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. దీంతో ఆ ఛాన్స్ నేరుగా రాధాకృష్ణన్ దక్కించుకున్నారు. కేంద్ర బీజేపీ నేతలకు ఆయనపై ప్రత్యేక గౌరవం ఉండడంతో ముందు ఆయనను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద స్థాయిలో, రాజ్యాంగ పరంగా కీలకం అయిన ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టారు.



రాజ్యసభలో వ్యూహం :
రాజ్యసభ చైర్మన్‌గా ఉప రాష్ట్రపతి పాత్ర ఎంత ప్రాధాన్యమో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయేకు అక్కడ బొటాబొటీ మెజారిటీ ఉన్నా, రానున్న రోజుల్లో అది కష్టమవ్వచ్చు. అటువంటి సమయంలో విపక్షాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ, బిల్లులు సాఫీగా పాస్ అయ్యేలా చూడగలిగే వ్యక్తి కావాలి. అలాంటి అర్హతలన్నీ ఉన్న వారే రాధాకృష్ణన్ అని బీజేపీ టాప్ లీడర్లు నమ్మారు. మొత్తం మీద, దక్షిణాది సమీకరణలు, ఆరెస్సెస్ అనుబంధం, గవర్నర్‌గా పనిచేసిన అనుభవం - అన్నీ  కలిపి రాధాకృష్ణన్‌కు ఉప రాష్ట్రపతి ఛాన్స్‌ను తీసుకొచ్చాయి. ఈ ఎంపికతో బీజేపీ మరోసారి రాజకీయ చెస్‌బోర్డులో మాస్టర్ స్ట్రోక్ వేసిందని చెప్పవచ్చు. దటీజ్ ది న్యూ గేమ్ ప్లాన్ ఆఫ్ ఎన్డీయే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: