Kukkatpally Murder Case: ఆ ఒక్క మాటే బాలుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించేసింది.. లేకపోతే పోలీసులు కూడా కనుక్కోలేరు..!

Thota Jaya Madhuri
గత మూడు–నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సహస్ర. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు ఛేదించబడింది. అందరూ అనుకున్నట్టుగానే ఆ బాలుడే ఆమెను హత్య చేసినట్లు తేలింది. పక్కింటి పదవ తరగతి బాలుడు కేవలం ఒక దొంగతనం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సహస్ర ఇంటికి వెళ్లిన ఆ బాలుడు, తాను దొంగతనం చేస్తున్నప్పుడు సహస్ర చూసిందన్న కారణంతో, ఆమె బయట పెట్టేస్తుందని భయపడి అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.

దొంగతనం ఎలా చేయాలి..? ఇంట్లోకి ఎలా వెళ్లాలి..? తర్వాత ఎలా బయటకు రావాలి ..? అనే వివరాలను కూడా ఆ బాలుడు ముందే కాగితం మీద రాసుకున్నట్లు విచారణలో తెలిసింది. దొంగతనం చేసి బయటికి వస్తూ గ్యాస్ ఆన్ చేసి పెట్టాలని, దాంతో ప్రమాదం జరిగినట్లు కనిపించి మొత్తం కాలిపోయిందని అనుకునేలా ప్లాన్ చేసినట్లు బయటపడింది. అయితే ఆ రోజు సహస్ర ఇంట్లోనే ఉండడంతో అతని ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. హత్య జరిగిన రోజున అతని దుస్తులపై రక్తపు మరకలు కనిపించగా, వాటిని చూసిన నిందితుడి తల్లిదండ్రులు కూడా మౌనం వహించారు. అందువల్ల ఈ విషయం బయటపడలేదు. పోలీసులు విచారణలో భాగంగా సహస్ర ఇంటికి తరచూ వచ్చే  బాలుడిని కూడా ప్రశ్నించారు. కానీ అతను ఎలాంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు.

సీసీ కెమెరాల్లో బయటివారు ఎవరూ రాకపోవడంతో, పోలీసులు.. ఈ పని బిల్డింగ్‌లో ఉండే వారిలో ఎవరో చేశారని ఫిక్స్ అయ్యారు. అయితే అంత చిన్న బాలుడు ఇలాంటి పని చేస్తాడని ఊహించలేకపోయారు. ఇన్ని రోజులుగా విచారణ చేసినా, ఆ బాలుడు నిందితుడని గుర్తించలేకపోయారు. కానీ విచారణలో ఇచ్చిన ఒక సమాధానం పోలీసులు అతడినే నిందితుడిగా గుర్తించేలా చేసింది. ఆ బాలుడిని ప్రశ్నించగా, అతడు – “అంకుల్, సహస్ర నాకు బాగా తెలుసు. చాలా మంచిపిల్ల. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. ఆమె ‘డాడీ… డాడీ…’ అంటూ గట్టిగా అరవడంతో నాకు భయమేసింది” అని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ ఈ విషయాన్ని చెప్పలేదు. దీంతో పోలీసులు తమదైన రీతిలో కఠినంగా విచారణ జరిపి అసలు నిజాన్ని బయటపెట్టారు. అదీ కాక, పక్కింట్లోనే ఉండే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆ రోజు సహస్ర ఇంటికి ఆ బాలుడు వెళ్లి వచ్చినట్లు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి హత్య చేసి తమ భవిష్యత్తును తాము నాశనం చేసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: