వారిని జైలులో వేయిస్తా.. జగన్ మాస్ వార్నింగ్ ..!
జైలుకు పంపుతాం అంటూ జగన్ తీవ్ర హెచ్చరికలు:
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల’ ఉద్యమం ముగింపులో భాగంగా జగన్ గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీపీపీ విధానం ఒక భారీ స్కామ్ అని ఆరోపించారు. "ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు ఎందుకు నడపాలి అని ఆలోచించే ఏకైక వ్యక్తి చంద్రబాబు. రేపు పోలీస్ వ్యవస్థను కూడా ప్రైవేటీకరిస్తారు" అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, పీపీపీ పద్ధతిలో కాలేజీలను దక్కించుకునే వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తామని సంచలన హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రబాబు కౌంటర్: " పేదలకు కార్పొరేట్ వైద్యం తప్పా ? "
జగన్ ఆరోపణలపై సీఎం చంద్రబాబు గట్టిగానే స్పందించారు. పీపీపీ విధానంలో ఉన్నా, ఆ కళాశాలల పేర్లు ‘ప్రభుత్వ కళాశాలలు’ గానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. "రుషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు చేసిన రూ. 500 కోట్లతో రెండు మెడికల్ కాలేజీలు కట్టేవాళ్లం" అని విమర్శించారు. దానికి బదులుగా జగన్, యోగా దినోత్సవం పేరుతో చంద్రబాబు రూ. 330 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధానం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని బలంగా నమ్ముతోంది.
ప్రభుత్వం పేర్కొంటున్న ప్రధాన అంశాలు:
అవుట్ పేషెంట్ (OP) సేవలు 100 శాతం ఉచితంగా అందుతాయి. 70 శాతం మంది పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయి చికిత్స లభిస్తుంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల స్థానిక విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. నిబంధనలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని, ప్రైవేట్ భాగస్వామ్యం కేవలం పెట్టుబడి మరియు నిర్వహణకే పరిమితమని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి భావోద్వేగపూరిత పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీపీపీ విధానమే సరైన మార్గమని సమర్థించుకుంటోంది. ఈ రాజకీయ రగడ చివరకు ఎటు దారితీస్తుందో, ప్రజలు ఏ విధానాన్ని ఆదరిస్తారో వేచి చూడాలి.