హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఆ ఒక్కటే టీడీపీ పరువు తీసేసిందా..?
అదే సమయంలో, రాజకీయంగా చూస్తే 2025వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఏ అంశాల వల్ల హైలైట్ అయింది? ఏ కారణాల వల్ల పరువు పోయింది? అనే విషయాలపై రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీకి సీఎం గా చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఏపీకి భారీ ప్రాజెక్టులు వచ్చాయని, మంచి మంచి పథకాలు అమలు చేయడంతో ప్రజలకు ఉపయోగం కలిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే కూటమి ప్రభుత్వ పరువు తీసిన ఒకే ఒక్క సంఘటనగా టిడిపి నాయకుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా, తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిగా టిడిపి నాయకుడు తాటిక నారాయణరావు పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విద్యార్థినిపట్ల ఆయన ప్రవర్తించిన తీరు చాలా అమానుషమని మహిళా నాయకులు, పలువురు ప్రముఖులు బహిరంగంగానే స్పందించారు.
ఇది కేవలం ఒక్కసారే కాదు, గత కొన్ని నెలలుగా కూడా ఆయన లైంగిక దాడులకు పాల్పడ్డాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచేందుకు తీసుకెళ్తున్న సమయంలో, మార్గమధ్యలో బహిర్భూమికి వెళ్లాలని వాహనం ఆపించాడు. ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తుండటంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిలబడ్డారు. అదే సమయంలో నారాయణరావు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి అందులో దూకేశాడు.
పెద్ద శబ్దం రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఆయన చెరువులో దూకి పారిపోయాడని అనుకోగా, మరికొంతమంది ప్రమాదవశాత్తూ జారిపడ్డాడేమో అని భావించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా వెతికినా ఫలితం కనిపించలేదు. చివరకు తెల్లవారుజామున ఆయన మృతదేహం లభించింది.
ఈ ఏడాది టిడిపికి తీవ్ర పరువు నష్టం జరిగిందంటే, అది తాటిక నారాయణరావు చేసిన ఈ దారుణమైన చర్య వల్లేనని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.