ఆశా భోస్లే మరణంపై దేశం దిగ్భ్రాంతి.. మోదీ ఎమోషనల్ ట్వీట్..!

Amruth kumar
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. ఏప్రిల్ 12, 2026న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో పోరాడుతూ, బహుళ అవయవాల వైఫల్యంతో ఆమె మరణించారన్న వార్త వినగానే యావత్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.



ప్రధాని మోదీ భావోద్వేగ నివాళి - "ఆమె స్వరం కాలాతీతం"

ఆశా భోస్లే మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఆమె స్వరం కాలాతీతమైన తేజస్సును కలిగి ఉంది. మన సాంస్కృతిక వారసత్వాన్ని ఆమె సుసంపన్నం చేశారు" అంటూ ప్రధాని కొనియాడారు. గతంలో ఆమెతో జరిపిన సంభాషణలను గుర్తుచేసుకుంటూ, ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె పాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని నివాళులర్పించారు.



ఎనిమిది దశాబ్దాలు  - 12 వేల పాటలు, ఒకే ఒక పేరు!

1933లో మంగేష్కర్ కుటుంబంలో పుట్టిన ఆశా భోస్లే.. సంగీతం అంటే కేవలం మెలోడీ మాత్రమే కాదు, అదొక పవర్ హౌస్ అని నిరూపించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 12 వేల కంటే ఎక్కువ పాటలు పాడిన గాయనిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె గొంతులో గజల్స్ ఎంతటి మాధుర్యాన్ని పలికించేవో, 'క్యాబరే' సాంగ్స్ అంతే జోష్ ఇచ్చేవి. ఆత్మను కదిలించే గజల్ నుంచి కుర్రాళ్ళను ఊపేసే ఐటమ్ సాంగ్ వరకు ఆమె గొంతు ఒక అద్భుతం. రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమె ప్రతిభకు సాక్ష్యాలు.



మంగేష్కర్ సిస్టర్స్ - ఒక సువర్ణ అధ్యాయం!

లతా మంగేష్కర్ తర్వాత ఆ స్థాయిలో భారతీయ సంగీతాన్ని శాసించిన గొంతు ఆశా భోస్లేది మాత్రమే. 'ఉమ్రావ్ జాన్', 'ఇజాజత్' వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులకు ఆణిముత్యాలే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమె పాడని భాష లేదు, ఆమె మెప్పించని ప్రాణం లేదు.ఒక సామాన్య బాలికగా మొదలై, గిన్నిస్ రికార్డుల స్థాయికి ఎదిగిన ఆశా భోస్లే ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆమె మరణంతో సంగీత ప్రపంచంలో ఒక శూన్యం ఏర్పడింది. కానీ, ఆమె పాడిన వేల పాటలు యుగయుగాల వరకు ఆమె పేరును సజీవంగా ఉంచుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: