బొత్స సత్యనారాయణ. ఏపీలో కాంగ్రెస్ను నడిపించిన నాయకుడిగా, వైఎస్కు అత్యంత ప్రియ నేతగా ఎదిగిన ఆయన కుటుంబం మొత్తం రాజకీ యాల్లో తలమునకలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2004, 2009 మధ్య కాలంలో రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడిగా బొత్స పేరుసం పాయించుకున్నారు. ఆయన సతీమణి, సోదరుడు కూడా రాజకీయాల్లో కీలక రోల్ పోషించిన ఘన చరిత్రను సొంతం చేసుకున్నారు. నిజానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు 2004, 2009 ఎన్నికలు అనేక మధురానుభూతులు పంచడంతోపాటు వైఎస్ జీవించి ఉన్నంత వరకు అద్బుతమైన రాజకీయాలను అనుభవించారు. వీరిలో బొత్ససత్యనారాయణ ఫ్యామిలీ కూడా ఉండడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై బొత్స విజయం సాధించారు.
2004లో 11 వేల ఓట్ల మెజారిటీ, 2009లో 5 వేల ఓట్ల మెజారిటీతో బొత్స దూసుకు పోయారు. అయితే, 2014లో మాత్రం ఆయన హవాకు బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన వేడిలో ఉన్న ఏపీలో కాంగ్రెస్కు తీవ్రమైన ఎదురు గాలులు వీచాయి. అయినప్పటికీ.. బొత్స కాంగ్రెస్టికెట్పై మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేశారు. అదేసమయంలో టీడీపీ డాక్టర్ కిమిడి మృణాళిని తెరమీదికి తెచ్చి టికెట్ ఇచ్చింది. విభజన హవా, కాంగ్రెస్పై వ్యతిరేక పవనాలలో బొత్స చిత్తుగా ఓడిపోయారు. దాదాపు 20 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో మృణాళిని విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న బొత్స జగన్కు జై కొట్టారు. బొత్స వంటి సీనియర్ నాయకుడు రావడంతో జగన్ కూడా ఆయనకు కీలకమైన పదవిని ఇచ్చి.. ప్రధాన కార్యదర్శిగా గౌరవించారు. పార్టీలో బొత్స కూడా కీలకంగా వ్యవహరించి శ్రీకాకుళంలో పార్టీని పుంజుకునేలా చేశారు.
ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ప్రయోగానికి సిద్ధమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జునకు ఇక్కడ నుంచి టికెట్ కేటాయించింది. ఇక, వైసీపీ టికెట్పై బొత్స పోటీ చేశారు. అయితే, 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కిమిడికి ఆయన మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి ఆమె మెరుపులు కురిపిస్తుందని బాబు ఆశించారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఆమె మంత్రిగా విఫలమయ్యారు. దీంతో 2017లో ఆమెను మార్చిన చంద్రబాబు టికెట్ ఇచ్చేందుకు కూడా వెనుకంజవేశారు. దీంతో కిమిడి తన కుమారుడు కిమిడి నాగార్జునను రంగంలోకి దింపింది. ఇక, తాజా పోరు మొత్తం బొత్స వర్సెస్ మాజీ మంత్రి తనయుడు.. అన్న విధంగానే మారిపోయింది. ఇక, జనసేన నుంచి మైలపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి జమ్ము ఆదినారాయణ రంగంలో ఉన్నారు. అయినప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం కిమిడి వర్సెస్ బొత్స అన్న విధంగానే సాగింది. ఇక్కడ బొత్స కు సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
నియోజకవర్గంలో మృణాళిని మంత్రిగా ఉన్నా అక్కడ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదన్న అభిప్రాయం అక్కడ బలంగా వచ్చేసింది. బొత్స పదేళ్ల పాలనలో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది. టీడీపీ పాలనలో స్థానికేతరుల వల్ల ఉపయోగం లేదని భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ సారి బొత్సకే జై కొట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మళ్లీ ఏపీ రాజకీయాల్లో బొత్స ఓ వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.