కర్ణాటకలో రాజకీయం మరోమారు రసకందాయంలో పడింది. ఆ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు మళ్లీ ప్రభుత్వాన్ని కూల్చే ఎత్తుగడలు అంటూ విమర్శలు- ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అతి తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న కుమార స్వామి టీం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. దీని వెనుక బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు క్యాంపు రాజకీయాలు చేసి, ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలు జారుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అసమ్మతి నేత రమేష్ జార్కిహోళి పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఆయనతో పాటుగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మెజార్టీ తగ్గుతుందని, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
224 అసెంబ్లి స్థానాలు ఉన్న కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 112. బీజేపీకి 104 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉంది. ఈ మేజిక్ ఫిగర్ నుంచి ఎమ్మెల్యేలు జారుకోవడం పార్టీని కలవరానికి గురిచేస్తోంది.