ఛత్తీస్ గఢ్.. అంటే నలబై దుర్గాల రాజ్యం అని అర్థం.. పేరుకు తగ్గట్టే ఇది కోటల ప్రాంతమే.. బీజేపీ కంచుకోటల ప్రాంతం.. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. ఛత్తీస్గఢ్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 11లోక్సభ స్థానాలకుగాను 9 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైంది. 15ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్ గడ్డపై బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం హస్తగతం చేసుకున్నా బీజేపీ నిరాశపడలేదు. విజయం కోసం ఆ పార్టీ నేతలు చేసిన కృషి ఫలించింది.
గతేడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి చవి చూడటం బీజేపీ కు మింగుడు పడలేదు. ఛత్తీస్గఢ్ లో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. అందుకే ఈ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు సిద్దం చేసింది. ముందు జాగ్రత్తలు తీసుకుంది. సిట్టింగ్ ఎంపీలను మార్చేసింది. కొత్త వారిని బరిలో నిలపింది. ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. దీనికి తోడు దేశమంతటా బీజేపీ జోరు కొనసాగడం ఆ పార్టీకి కలిసొచ్చింది.