రాజకీయ నాయకులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ ఐఏఎస్, ఐపీఎస్లు పదవీవిరమణ వరకూ అధికారంలోనే ఉంటారు. నాయకులు ఐదేళ్లే పదవిలో ఉంటారు. కానీ ఈ ఐదేళ్లూ నాయకుల చేతిలోనే అధికారుల భవితవ్యం ఉంటుంది.
కానీ కొందరు అధికారులు నాయకుల మోచేతుల కింద నీళ్లు తాగుతూ.. వెన్నముక లేకుండా వ్యవహరించడం, పదోన్నతుల కోసం పాకులాడటం.. వంటి కారణాలతో అధికార పార్టీ కార్యకర్తల్లా మారుతున్నారు. అలాంటి వారు అధికారంలో పార్టీమారగానే ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఏపీలో జగన్ సీఎం కాబోతుండటంతో కొందరు ఐపీఎస్ అధికారులు దీర్ఘ కాలిక సెలవులపై వెళ్ళేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇంటిలిజెన్స్, ఏపీ ఏసిబీ లో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోదామనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.
టీడీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న భ్రమల్లో జగన్తో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు చిక్కుల్లోపడ్డారు. జగన్తో వేగడం కష్టమని ముందుగానే ఫిక్సవుతున్న వారు.. కేంద్రానికి డిఫ్యుటేషన్ పై వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నారు.