ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కేబినెట్ అలా కొలువు దీరిందో లేదో ? అప్పుడు ఆయన మంత్రి వర్గ సహచరుల్లో కొంతమందిపై ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ప్రతి విషయంలో చాలా పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. జగన్ను కాని, ఆయన కేబినెట్ను కాని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను కాని ఎవ్వరూ విమర్శించేందుకు కూడా సాహసం చేయని పరిస్థితి. ఇలాంటి టైంలో ఆయన కేబినెట్ సహచరుల్లో అప్పుడే ఒకరిపై ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
ఆ ఆరోపణలు వచ్చింది ఎవరిమీదో కాదు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణిపై కావడం విశేషం. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ నియోకవర్గం నుంచి వైసీపీ తరపున వరుసగా రెండోసారి గెలిచిన ఆమెకు జగన్ ఎస్టీ + మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. ఆమె ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజునే ఆమె క్యాస్ట్పై ఆరోపణలు వచ్చాయి.
పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని.. అలాంటి టైంలో ఆమెను ఎస్టీగా ఎలా పరిగణిస్తారని ఆయన ఆరోపిస్తున్నారు. శ్రీవాణిని ఏకంగా మంత్రి వర్గంలోకి తీసుకుని.. ఆమెకు గిరిజన శాఖ ఇవ్వడం కూడా సరికాదని అప్పలనర్స చెపుతున్నారు. విశాఖ జిల్లా అరకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని... ఆ టైంలోనే ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. ఆమె సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆమె 2014లోనే ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కోర్టులో కేసు నమోదు అయ్యిందని.. ఇప్పుడు మళ్లీ ఆమెకు టిక్కెట్టు ఇవ్వడంతో పాటు ఏకంగా మంత్రి పదవి కూడా ఎలా ? ఇచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో ? చూడాలి.
గతంలో ఇదే కురుపాం పక్కన ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడికల రాజన్నదొరపై పోటీ చేసిన ఆర్.భంజ్దేవ్ సైతం ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనపై పోటీ చేసిన రాజన్నదొర ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన వరుసగా మరో మూడుసార్లు కూడా గెలిచారు. ఇప్పుడు శ్రీవాణి ఉదంతం కూడా ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది.