అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్న జగన్..?
అవును.. ఏపీ సీఎం జగన్ అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నారు. తన సర్కారు తీసుకున్న నిర్ణయాలపై తానే స్వతంత్ర్య విచారణకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఏ శాఖలోనైనా 100 కోట్లకు మించి కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటే ముందుగా ఆ టెండర్లను పరిశీలించేందుకు న్యాయ కమిషన్ ను ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ న్యాయ కమిషన్ ను ఏర్పాటు కోసం జగన్ సర్కారు బిల్లును సిద్ధం చేసేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిని సభలో ప్రవేశపెడతారు. ఈ న్యాయ కమిషన్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో పని చేస్తుంది.
సిట్టింగ్ జడ్జి అందుబాటులో లేకపోతే రిటైర్డు న్యాయమూర్తి ఉంటారు. అంతే కాదు.. టెండర్ల పరిశీలన కోసం సాంకేతిక సిబ్బందిని కూడా నియమిస్తారు. ప్రభుత్వం 100 కోట్లకు మించి కాంట్రాక్టు ఇవ్వాలనుకున్నా.. ఆ కాంట్రాక్టును ఈ కమిషన్ సమీక్ష చేసిన తర్వాతే ప్రకటన ఇస్తారు.
అంతేకాదు.. ఈ ప్రక్రియ అంతా ప్రజలకు తెలిసేలా వెబ్సైట్లో ఉంచుతారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటుచేస్తారు. వెబ్ సైట్ లో ఉంచిన కాంట్రాక్టుపై ఎవరైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయొచ్చు. అంటే.. మరి జగన్ స్వయంగా అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నట్టేగా..