తెలంగాణ లో టీడీపీ కోలుకోవడం ఇక కష్టమే ...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక కోలుకోవడం కష్టమేనా ? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపధ్యం లో టీడీపీ ని కొందరు మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు వీడిన విషయం తెల్సిందే . రాష్ట్ర విభజన అనంతరం కూడా టీడీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాన్ని చేసింది . ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా 15 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకుంది .
అయితే టీఆరెస్ అపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ ని చావు దెబ్బ కొట్టింది. టీఆరెస్ అపరేషన్ ఆకర్ష్ భాగంగా 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ని వీడి టీఆరెస్ లో చేరడమే కాకుండా , పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేశారు . ఎమ్మెల్యేలు పార్టీ చేజారిన తరువాత కూడా రాష్ట్రం లో టీడీపీ పుంజుకుంటున్న తరుణం లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెజారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఇక ప్రస్తుతం మరికొంతమంది రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు .
టిడిపి సీనియర్లు పెద్దిరెడ్డి తో పాటు పలువురు ఇప్పటికే బిజెపిలో చేరగా, తాజాగా ఈ నెల 18న మరికొంతమంది టీడీపీ నాయకులు, గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. క్షేత్రస్థాయిలో ఇంతో, అంత బలం కలిగిన నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతుండటంతో రాష్ట్రం లో టిడిపి ఖాళీ అవుతున్నట్లు కన్పిస్తోంది . తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తోన్న బిజెపి నాయకత్వం, ఒక తెలుగుదేశం పార్టీ నేతలనే టార్గెట్ చేయకుండా, అటు కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ చెందిన పలువురు అగ్రనాయకులు ఇప్పటికే బిజెపి నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే వీరు ఎప్పుడూ పార్టీని వీడుతారనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ, త్వరలోనే పార్టీ మారడం మాత్రం గ్యారెంటీ అనే వాదనలు వినిపిస్తున్నాయి.