సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం నుంచి సాయంకాలం వరకు.. ఆఫీస్ లో ఉద్యోగులు బిజీ బిజీగా గడుపుతారు. కంప్యూటర్ ముందు కూర్చొని హడావుడిగా పనిచేస్తుంటారు. కొంతకాలం వరకు ఒకే. అలాగే లేవకుండా కూర్చొని పనిచేయడం వలన.. మెడమీద, నడుముపైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో సమస్యలు మొదలౌతాయి. దీని ప్రభావం మెదడుపై పడుతుంది. ఫలితంగా పనిచేయలేము. ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి పనిచేసే సమయంలో ఒత్తిడి తగ్గించుకోవాలి. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఏమిటి.. ఎలా ఒత్తిడిని జయించాలి.. తెలుసుకుందాం..
మానిటర్ ను కంటికి సమకోణంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కుర్చీలో వొంగిపొయి కూర్చోకూడదు. 45డిగ్రీల కోణంలో కూర్చొని పనిచేస్తుంటారు. ఇలా చేయడం వలన వెన్నుపై భారం పడుతుంది. వెన్నుముక వొంగిపొతుంది. వెన్నుపూసల మధ్య రాపిడి పెరిగి.. లింక్ తప్పిపోయే అవకాశం ఉంటుంది. వీలైనంతగా నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించండి.
ప్రతి 15 లేదా 20 నిమిషాలకు ఒకమారు దృష్టిని మరల్చండి. మెడకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ఫలితంగా మీద ప్రాంతంలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి గంటకు ఒకమారు లేచి అటు ఇటు నడవండి. కాళ్లకు రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. కండరాలు పట్టేయకుండా ఉంటాయి.
ఎక్కువగా నీరు, ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోండి. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. వీలు కుదిరినప్పుడు సహా ఉద్యోగులతో సరదాగా నవ్వుతూ మాట్లాడండి. నవ్వు ఒత్తిడిని దూరం చేస్తుంది. పనిని కష్టమైన పనిలా కాకుండా.. ఇష్టంగా చేయడం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక వీకెండ్ లో ఇంట్లోనే కూర్చోకుండా.. సరదాగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం వలన వారం రోజుల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. బయటకు వెళ్లే సమయంలో ఆఫీస్ విషయాలు వేటిని మననం చేసుకోకూడదు. అప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడగలరు.