తాళం తీసేసరికి ఇండియా జనాభా రెట్టింపు ?
ఇపుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా సీజన్ నడుస్తోంది. దానికి ప్రజానీకం జడుస్తోంది. ఆ మహమ్మారి బయట ఉంటే తలుపేసుకుని చిక్కకుండా దక్కకుండా జనం ఇళ్ళ లోపల ఉంటున్నారు. భారత్ లాంటి దేశాల్లో అయితే ఇంటి తలుపులు వేసుకుని ఉండే సౌభాగ్యాన్ని భార్యామణులు తమ భర్తలతో చవి చూస్తున్నారు.
వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ అన్నట్లుగా భార్యల ఏడుపు చూడలేక కరోనా వచ్చిందా అన్నది కూడా సెటైరికల్ గా చూసినా కూడా ఎంతో కొంత నిజం ఉందేమో అనిపిస్తోంది. ఇక భారత్ లో ఇంట్లో ఉన్న వారంతా ఇపుడు తమ శ్రీమతులతో హాయిగా గడుపుతున్నారట.
ఎపుడో పెళ్ళి అయిన కొత్తల్లో ఇంతలా కలసి ఉండే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇపుడే అలాంటి చాన్స్ కరోనా పుణ్యమాని దొరికిందని సంతోషిస్తున్న జంటలు ఆనందంగా ఉన్నాయట. ఇక ఇపుడు చూసుకుంటే ఈ ఒంటరి తనం, దగ్గరి తనం, ఏకాంతం అన్నీ కలసి కొత్త స్రుష్టికి బీజం వేస్తున్నాయా అన్న డౌట్లు వస్తున్నాయట.
ఇది ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచంలో అన్ని చోట్లా ఇదే తీరుగా ఉంది. ఇంతవరకూ సంసారిక సుఖాలను కేవలం ఒక మొక్కుబడి తంతుగా భావించిన వారంతా ఇపుడు కావాల్సినంత సేపు సమయం ఉండడంతోనే అందులోనే మునిగితేలుతున్నారని అంటున్నారు. దీనికి అనేక దేశాల్లో జరిగిన ఘటనలు కూడా ఉదహరిస్తున్నారు.
అమెరికాలో పలు మార్లు తుఫాన్లు, ప్రక్రుతి విపత్తులు సంభవించినపుడు జనం ఇళ్ళల్లో గడిపిన సందర్భాలు ఉన్నాయట. అలాగే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి లాక్ డౌన్ లు జరిగినపుడు కూడా పెద్ద ఎత్తున పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయట.
ఇపుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కరోనా వైరస్ సందర్భంగా లాక్ డౌన్ విధిస్తున్నామని దాన్ని పూర్తిగా పౌరులు సద్వినియోగం చేసుకుని పిల్లలను కని దేశ జనాభాను పెంచాలని వింత విన్నపం చేయడం విశేషం. ఇక ఇది అక్కడ జనాభా తక్కువ కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో అయితే కుదిరే పనేనా అంటున్నారు.
ఇప్పటికే 130 కోట్ల మంది జనాభాతో ఉన్న ఇండియా ఇపుడు లాక్ డౌన్ పుణ్యమాని మరింతమందిని జాతికి అందిస్తే ఈ పేద దేశం పెంచి పెద్ద చేయగలదా అన్నది డౌట్. కానీ ఎవరేం చేయగలరు. అనుకోని అవకాశం. అందువల్ల ఇది వాడుకున్న వారికి వాడుకున్నంత. ఇక లాక్ డౌన్ ఎత్తేశాక దేశంలో జనాభా ఎంత పెరుగుతుందో చూడాలి మరి.