కేంద్ర బడ్జెట్ అంటే ప్రభుత్వ విధానాల ఆవిష్కరణ. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే జమా ఖర్చుల నివేదిక. అలాంటి బడ్జెట్ ను తయారీ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోబోదు. వాస్తవానికి అదో మహాయజ్ఞమనే చెప్పాలి. ఎందరో ఆర్థిక వేత్తలు, మరెందరో నిపుణులు, శాఖాధిపతులు రాత్రి పగలన్న తేడా లేకుండా శ్రమించి బడ్జెట్ కు తుది రూపం ఇస్తారు. రాజకీయ బత్తిడులు, వివిధ వర్గాల డిమాండ్లు, ఆర్థిక ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని కేంద్ర సర్కార్ బడ్జెట్ తయారు చేస్తుంది. బడ్జెట్ రూపకల్పన ఒక ఎత్తైతే దాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే వరకు అందులోని విషయాలు బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచడం నిజంగా కత్తిమీద సాములాంటిది. గతంలో బడ్జెట్ పేపర్లను రాష్ట్రపతి భవన్ లో ముద్రించే వారు. అయితే 1950 లో బడ్జెట్ లీక్ కావడంతో అప్పటి నుంచి మింట్ రోడ్ ప్రెస్ కు మార్చారు. 1980 నుంచి ఢిల్లీ రైజినా హిల్స్ లోని నార్త్ బ్లాక్ బేస్ మెంట్ లోనే బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. సహజంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అన్ని మినిస్ట్రీలు, డిపార్ట్ మెంట్లు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు సర్కులర్లు పంపడం తో బడ్జెట్ ప్రక్రియ కు శ్రీకారం చుడతారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి అవసరమైన నిధుల వివరాలను ఆయా శాఖలు ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందులో రోజువారీ ఖర్చుల నుంచి స్పెషల్ ప్రాజెక్టుల వరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. నవంబర్ లో ఆర్థిక శాఖ, చాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్వెస్టర్లు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సంప్రదింపులు జరుపుతారు. పన్న తగ్గింపులు, ఆర్థిక రాయితీల గురించి ఆయా వర్గాల వినతుల్ని అధికారులు స్వీకరిస్తారు. చివరగా ఆర్థిక మంత్రి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఆ తరువాత వారి డిమాండ్ లు వాస్తవ పరిస్థితులకు కేటాయింపులు జరుపుతారు. అధికా పార్టీ ఆకాంక్షలు, భాగస్వామ్య పక్షాల కోర్కెలకు అనుగుణంగా బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతారు. బడ్జెట్ తయారీ ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతుంది. ఎంపిక చేసిన 5గురు స్టెనోగ్రాపర్లు మాత్రమే బడ్జెట్ పేపర్ల తయారీ లో పాల్గొంటారు. ఈ సమయంలో నార్త్ బ్లాక్ లోని ప్రజల రాకపోకలు, ఫోన్స్ కాల్స్ పై జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఇంటలిజెన్స్ బ్యూరో నిఘా ఉంటుంది.
ఇక బడ్జెట్ కాపీల ముద్రణ ప్రక్రియ కూడా సంప్రదాయం ప్రకారం ప్రారంభం అవుతుంది. నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక అనంతరం ప్రింటింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. బడ్జెట్ ప్రతులను తయారు చేసే సమయంలో సైబర్ చౌర్యం జరగకుండా స్టెనోల కంప్యూటర్ లను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వర్ నుంచి వేరు చేస్తారు. నార్త్ బ్లాక్ లోపలకు బయట నుంచి ఫోన్లు రాకుండా అడ్డుకోవడం, సమాచారం లీక్ కాకుండా చూసేందుకు జామర్లు ఏర్పాటు చేస్తారు. ప్రింటింగ్ ప్రాసెస్ లో పాల్గొన్న వారికి 10 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. అధికారులు పినచేస్తున్న ప్రాంతానికి ఆర్థిక శాఖ మంత్రి మాత్రమే వెళ్లే వీలుంటుంది. నార్త్ బ్లాక్ బేస్ మెంట్ లో ప్రింటింగ్ ప్రెస్ ఏరియాకు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధికారులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం పంపేందుకు అనుమతిస్తారు. అయితే నేరుగా మాట్లాడే అవకాశం మాత్రం ఉండదు.