నిత్యమూ 12 వేలకు పైగా రైళ్లు 2.3 కోట్ల మంది అవసరాలను తీరుస్తున్న వేళ, రైళ్లలో మరింత తాజా ఆహారం అందించాలని, అందరూ కోరుకునే పదార్థాలను అందుబాటులో ఉంచాలన్ఉన ద్దేశంతో ఐఆర్సీటీసీ, భారతీయ రైల్వేలు పలు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ లో భాగంగా, ముందుగా వచ్చే ఆర్డర్లతో పాటు, లాస్ట్ మినిట్ కొనుగోళ్ల కోసం వెండార్ బాయ్స్ ప్లాట్ ఫారాలపై నిలబడి తినేందుకు సిద్ధంగా ఉండే పిజ్జాలు, బర్గర్లు ఇతర ఆహార పదార్ధాలను విక్రయిస్తారు. ఈ మేరకు డొమినోస్ పిజ్జా, బర్గర్ కింగ్, సబ్ వే, కేఎఫ్సీ, పిజ్జా హట్ తదితరాలతో ఒప్పందాలు కుదిరాయి.
ఆహారం, పానీయాల విశ్లేషణ, ప్యాకేజింగ్కు సంబంధించి సాంకేతికతను బదిలీ చేసుకోవడానికిగాను డిఫెన్స్ ఫుడ్ రీసెర్చి ల్యాబరేటరీ(డీఎఫ్ఆర్ఎల్)తో ఐఆర్సీటీసీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డీఆర్డీవో అనుబంధ సంస్థ అయిన డీఎఫ్ఆర్ఎల్ ద్వారా కుదుర్చుకున్న ఈ ఒప్పందం మేరకు అప్పటికప్పుడు తినడానికి ఉపయోగపడే(రెడీ టు ఈట్) ప్యాక్ చేసిన ఆహారం రైల్వే ప్రయాణికులకు మరింత నాణ్యతతో అందించడానికి వీలవుతుంది. సాంకేతికత బదిలీ(టీఓటీ)కి ఉద్దేశించి ఒప్పందంపై ఐఆర్సీటీసీ సీఎండీ ఎ.కె.మనోచ, డీఎఫ్ఆర్ఎల్ డైరెక్టరు రాకేశ్కుమార్ శర్మ సంతకాలు చేశారు.
తొలి దశలో హౌరా, ముంబై, మధురై, ఆగ్రా, పుణె, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, సరాసరిన రూ. 100 నుంచి రూ. 125 ధరలో ఫుడ్ లభిస్తుందని వివరించారు. రైల్వేల కసమే ప్రత్యేకంగా మెనూను సిద్ధం చేస్తున్నట్టు డొమినోస్ పిజ్జా పేర్కొంది. రైలు ప్రయాణికుల కోసం నాలుగు అంగుళాలుండే శాండ్ విచ్ ని తొలిసారిగా తయారు చేస్తున్నామని, దీని ఖరీదు రూ. 70గా నిర్ణయించామని సబ్ వే పేర్కొంది.
ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే అతిసున్నితమైన పాలిమెరిక్ పొరల తయారీలో డీఆర్డీఓ పేర్గాంచింది. వీటిని ఆహారంతో పాటు తినేయవచ్చు. ఇష్టం లేకపోతే వేడి నీరు లేదా నీటి ఆవిరితో కరిగించేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ప్యాకేజింగ్తో పోలిస్తే ఇది ఎంతో అధునాతనం, వినియోగదారులకు సౌలభ్యం కూడా. జులై మొదటివారంనాటికి వెజిటబుల్ బిర్యానీ, పులిహార, నిమ్మఅన్నం, గోధుమ ఉప్మా, పప్పు-అన్నం, చికెన్ బిర్యానీ తదితర 36 వేల ప్యాకెట్లను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నామని ఐఆర్సీటీసీ తెలిపింది.