ఆంధ్రప్రదేశ్లో కొలువుల జాతర మొదలైంది. హోంశాఖ పరిధిలోని సివిల్, అర్మడ్ రిజర్వు విభాగాలు, జైళ్ల శాఖలో 4,548 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన విడుదలైంది. ఏపీ డీజీపీ జేవీ రాముడు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగాల భర్తీ ప్రకటనను ఆన్లైన్ ద్వారా విడుదల చేసి..ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. పోస్టుల భర్తీలో ఈ పర్యాయం మహిళా అభ్యర్థులకు 33 శాతం కేటాయించామని చెప్పారు. ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో మహిళలకు 20 శాతమే కేటాయించినట్లు తెలిపారు.
రిక్రూట్మెంట్కు సంబందించి ఏదైనా ఫిర్యాదులుంటే 9441450639 నంబర్కు లేదా recruitmentsappolice2016@gmail.comకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రకియ మొత్తం ఆన్లైన్లోనే జరగుతుందన్నారు. recruitment.appolice. gov.in వెబ్సైట్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.
ఉద్యోగాల నియామక ప్రక్రియ రెండేళ్లు ఆలస్యమైనందున ఆ మేరకు అభ్యర్థులకు రెండేళ్ల వయోపరిమితి పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, అవి పరిశీలనలో ఉన్నాయని వివరించారు. తొలిసారిగా అభ్యర్థుల ఎంపికకు ప్రాథమిక పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం ప్రధాన పరీక్ష చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి శిక్షణనిచ్చేందుకు సరిపడా వసతులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో దశలవారీగా పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నామన్నారు.