శశికళపై కాలు దువ్విన సెల్వం..హీటెక్కుతున్న తమిళ రాజకీయాలు
పన్నీర్ సెల్వం చెప్పినవన్నీ అబద్ధాలే అని, అందులో ఎంత మాత్రం నిజం లేదన్నారు చిన్నమ్మ. రాజీనామా చేయాల్సిందిగా ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని శశికళ అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి పార్టీ సభ్యత్వాన్నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలంతా ఒక్క కుటుంబంలా కలిసే ఉన్నామన్నారు శశికళ. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని చెప్పారు.
ఇంత తొందరగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు పన్నీర్ సెల్వం. తనపై శశికళ వర్గం ఒత్తిడి తెచ్చిందంటూ మరోసారి ఆరోపణలు చేశారు. అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. జయలలిత తనకు బాధ్యతలు అప్పగించారని ఎవరూ తనను పదవి నుంచి తప్పించలేరన్నారు. అమ్మ తనపై నమ్మకం ఉంచి రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుకు చేసుకున్నారు. ఒక వేళ తమిళులు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే తప్పకుండా ఆ బాధ్యతలు చేపడతానని వెల్లడించారు పన్నీర్.