భారమవుతున్న ఓఆర్ ఆర్ ప్రయాణం
ఇకపై మీరు ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎక్కి రయ్.. మనీ దూసుకుపోవాలంటూ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలేమో.. ఎందుకంటే మరోసారి ప్రయాణీకుల టోల్ తాట తీసేందుకు సిద్ధమైంది హెచ్ఎండీఏ.. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై పలుమార్లు టోల్ రుసుం పెంచిన అధికారులు ఈ సారి దాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించింది. అది కూడా నెల 15 నుంచే అమలు చేయాలని డిసైడ్ అయిపోయారు అధికారులు.
ఇకపై నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం మరింత భారం కానుంది. ఇతర రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఓఆర్ ఆర్ గత కొంతకాలంగా ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 158 కిలోమీటర్ల ఓ ఆర్ ఆర్ లో ఇప్పటి వరకు సుమారు 156.9 కిలో మీటర్ల మేర అందుబాటులోఉంది. ఇంకా కండ్లకోయ గ్రామ సమీపంలో 1.1 కిలోమీటర్ మేర అసంపూర్తిగా మిగిలి ఉంది. అయితే మిగతా ఓ ఆర్ ఆర్ మాత్రం అనునిత్యం వాహనాల రాకపోకలతో బిజీ బిజీగా ఉంటుంది.
ప్రతీ రోజు వేలాది వాహనాలు ఓఆర్ఆర్ పై దూసుకుపోతుంటాయి. ఇలా వెల్లే ప్రతీ వాహనం తప్పనిసరిగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ పాత పెద్దనోట్ల రద్దు తర్వాత దాదాపు 23 రోజులు టోల్ ఛార్జీలను వసూలు చేయలేరు అధికారులు. ఇప్పుడు ఆ కరువు మొత్తం తీర్చుకునేందుకు సిద్ధమై పోయింది హెచ్ఎండీఏ. ఇప్పటి వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై కారు, వ్యాను ఇతర వాహనాలకు కిలో మీటర్ కు రూ.1.58 పైసలు వసూలు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణీస్తున్నారన్నది సంబంధిత రశీద్ లో నమోదు చేస్తారు. దాని ప్రకారమే ఔటర్ పై ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా ఛార్జ్ వసూలు చేస్తారు.
అయితే ఇకపై ఈ ఛార్జ్ ను ఒకటికి రెండింతలు అంటే.. డబుల్ వసూలు చేయాలని నిర్ణయించారు హెచ్ఎండీఏ అధికారులు. అందులో భాగంగా ఈ చార్జీని ఏకంగా కిలో మీటర్ కు రూ.2.54పైసలు వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా ఓ ఆర్ ఆర్ను అభివృద్ధి చేసేందుకేనని, ఔటర్ పై మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో యమునా ఎక్స్ ప్రెస్ వే, పుణే-ముంబై ఎక్స్ ప్రెస్ వేలా ఆ ఆర్ ఆర్ను డెవలప్ చేస్తామని అందులో భాగంగానే ఈ పెంపు అని అంటోంది హెచ్ ఎండీఏ.
దేశంలోని మిగతా హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ లతో పోల్చితే ఓ ఆర్ ఆర్ నాణ్యత విషయంలోనూ, ఇతరత్రా సదుపాయాల విషయంలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తోందని, అయితే ఛార్జ్ లు మాత్రం ఇక్కడే తక్కువగా ఉన్నాయని, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు, భద్రతా పరంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. మరి అలాంటప్పుడు ఛార్జీల పెంపు తప్పదని చెబుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈనెల 15 నుంచి టోల్ తాట తీసేందుకు సన్నాహాలు చేస్తోంది హెచ్ ఎండీఏ..
ఇప్పటి వరకు
ఉన్న ఛార్జీలను గమనిస్తే..
కార్లు, జీపులు, లైట్ మోటర్ వెహికిల్స్ కు ప్రస్తుతం రూ.1.5 వసూలు చేస్తుండగా.. కొత్త రేట్ల ప్రకారం రూ.1.58 వసూలు చేయనున్నారు. మినీ బస్సు, లైట్ కమర్షియల్ వాహనాలకు ప్రస్తుతం రూ.1.69 వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.2.54 వసూలు చేస్తారు. బస్సు, టీ యాక్సిల్ వాహనాలకు ఇప్పుడు రూ.3.53 వసూలు చేస్తున్నారు అదే పెరుగుతున్న రేట్ల ప్రకారం రూ.4.50 వసూలు చేయనున్నారు. త్రీ యాక్సిల్ వెహికిల్స్ కు ప్రస్తుతం రూ.3.85 ఛార్జ్ చేస్తున్నారు. ఇకపై ఇది రూ.5.78 కానుంది. మల్టీ యాక్సిల్ వాహనాలకు ప్రస్తుతం రూ.5.54 వసూలు చేస్తున్నారు. పెరిగే రేట్ల ప్రకారం ఇది రూ.8.51 కానుంది. ఇక ఓవర్ సైజ్డ్ వెహికిల్స్ కు రూ.6.74 ఛార్జ్ చేస్తుండగా.. ఇక మీదట రూ.10.11 కానుంది.
ఇలా రింగ్ రోడ్డు పై వాహనాల ఛార్జీలు ఒకటికి రెండింతలు
కానున్నాయి. దీంతో ఓ ఆర్ ఆర్ పై ప్రయాణమంటేనే ప్రయాణీకుల గుండెల్లో గుబులు పుట్టే పరిస్థితి నెలకొంటుంది.