అన్నాడీఎంకే అధినేత్రి శశికళ శిక్ష అనుభవిస్తూ ఉంటున్న సెల్ పక్కనే సైనేడ్ మల్లిక అనే అత్యంత ప్రమాదకర సీరియల్ కిల్లర్ ఉందన్న వార్తలు గతవారం నుండి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడా సైనేడ్ మల్లిక అలియాస్ "కేడీ కెంపమ్మ" ను బెలగావిలోని హిందాల్గా జైలుకు మార్చారు. శశికళతో అతి సన్నిహితంగా ఉంటున్నద నే, ఆమెను జైలు మార్చినట్లు పరప్పన అగ్రహార జైలు అధికారులు వెల్లడించారు.
శశికళ జైలుకొచ్చినప్పటి నుంచి ఆమెతో మల్లిక చాలా సన్నిహితంగా ఉంటున్నదని జైలు అధికారులు తెలిపారు. ఆమెను భోజనం కోసం కూడా క్యూలో నిల్చోనిచ్చేది కాదని, శశికళ దగ్గరికే మల్లిక భోజనం తెచ్చి ఇచ్చేదని ఓ అధికారి చెప్పారు. అయితే ఈ సాన్నిహిత్యమే అధికారులను అప్రమత్తం చేసింది. భద్రతా కారణాలు చూపుతూ గతవారమే మల్లికను మరో జైలుకి తరలించారు.
కనీసం మల్లికకు కూడా ముందుస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు లగేజీ సర్దుకోవాల్సిందిగా అధికారులు సూచించినట్లు సమాచారం. ఆరుగురు మహిళలను విషం పెట్టి చంపినట్లు మల్లికపై ఆరోపణలు ఉన్నాయి. దేశంలోనే మొదటి మహిళా సీరియల్ కిల్లర్గా పేరున్న మల్లికను 2008లో అరెస్ట్ చేశారు. ఓవైపు శశికళను చెన్నైకి తరలించే ప్రయత్నం లో ఆమె లాయర్లు ఉండగానే, మరోవైపు మల్లికను బెలగావి జైలుకు అధికారులు తరలించడం గమనార్హం. దీన్ని బట్టి శశికల కు భద్రత కలిపిస్తారు తప్ప చెన్నై జైలుకు మార్చే అవకాశాలు సన్నగిల్లుతున్నట్లే.
బెలగావిలోని హిండాల్గా జైలు దేశం లోని పురాతన జైళ్లలో ఒకటి. ఇక్కడ హత్యానేరం ఉన్న ఖైదీలే వందల సంఖ్యలో ఉన్నారు.