తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. ఇటుకతో వస్తే రాయితో సమాధానం చెప్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై హస్తం పార్టీ నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. మహబూబా బాద్ జిల్లా పర్యటనలో భాగంగా తమ పార్టీ నేతలను సన్నాసులు అనటాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
కేసీఆర్ కుటుంబంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠా అంటూ ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. కేసీఆర్ తరహాలో ఆంధ్ర నాయకులకు సూట్ కేసులు మోసిన చరిత్ర తమకు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి దోచుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వమేనని ఉత్తమ్ మండిపడ్డారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లుకు దాదాపు 30 వేల కోట్ల టెండర్లను కట్టబెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సెక్యులర్ దేశంలో ప్రజాధనంతో కోట్ల రూపాయలు దేవుడి మొక్కుల పేరుతో ఎలా ఖర్చు చేస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్ అప్పులు చేస్తున్నారని.. కోట్ల రూపాయల ప్రజాధనంతో ఖర్చుతో చార్టెడ్ విమానాల్లో విలాసాలు చేయటం దారుణమని ఉత్తమ్ విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేయబోరన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇకపై కేసీఆర్ భాషలోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. మరి తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రా కాంట్రాక్టర్ల రాజ్యమే నడుస్తోందా.. నిజంగానే కేసీఆర్ కుటుంబం గతంలో ఆంధ్రా పాలకులకు సూట్ కేసులు మోసింది.. ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉంది..?