గత కొన్ని రోజులుగా అమెరికాలో తెలుగు ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక తర్వాత అక్కడ జాత్యాహంకారం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం అన్యాయంగా తెలుగు యువకుడైన కూచిభొట్ల శ్రీనివాస్ ని దారుణంగా కాల్చి చంపాడు అమెరికాకు చెందిన ఆడమ్ ప్యూరింటన్ దుర్మార్గుడు.
తాజాగా నివాస్ కూచిభొట్లను హత్య చేసిన నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ను కాన్సస్ లోని డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు. అతనితో పాటు కాల్పులు జరిపిన వీడియో ఫుటేజీని కూడా కోర్టు ముందు ఉంచారు పోలీసులు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆడమ్ సమాధానం ఇస్తూ..ఇరాన్ దేశస్తుడనుకుని శ్రీనివాస్ ను కాల్చానని నిందితుడు ఆడమ్ ప్యూరింటన్(51) కోర్టుకు తెలిపాడు.
ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలు అతడిపై నమోదు చేశారు. విచారణ అనంతరం అతన్ని జాన్సన్ కౌంటీ జైలుకు తరలించారు. ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో దోషిగా తేలితే.. 50 ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది.