శ్రీలంకను ముంచెత్తిన భారీ వరదలు..200 మంది మృతి..!

Edari Rama Krishna
గత సంవత్సరం చెన్నై నగరాన్ని వరదలు ఏ రేంజ్ లో ముంచెత్తాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు శ్రీలంక కు వచ్చింది. ఒకవైపు భారీ వర్షాలు, వరదలు, మరోవైపు విరిగి పడుతున్న కొండచరియలు...శ్రీలంక అతలకుతలమవుతోంది. 200 మంది మృతి చెందగా, మరో వంద మంది జాడ తెలియడం లేదు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. గడచిన 14 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు ముంచెత్తడంతో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది.

 ప్రకృతికి కోపం వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ మద్య నెపాల్ లో తెలిసింది.  నెపాల్ దేశాన్ని భూ కంపం అతలాకుతలం చేసింది..ఇప్పటికే అక్కడ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తాయి.  తాజాగా శ్రీలంకను వరదలు ముంచెత్తుతున్నాయి. ఊర్లకు ఊళ్లు ఏరులైపారుతున్నాయి.  

మొత్తం 15  జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. 4 లక్షల 42వేల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో కలాని నది వెంట ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారత్ నుంచి మరోనౌక ఐఎన్‌ఎస్ శార్దూల్ కొలంబోకు చేరుకుంది. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ఆహారపదార్థాలతోపాటు పునరావాస సామాగ్రి ఐఎన్‌ఎస్ శార్దూల్‌లో తీసుకెళ్లారు. రెస్కూ టీం పలు ప్రాంతాల్లో బురదలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఆర్మీ ట్రక్కుల ద్వారా వరద బాధితులకు పునరావాస సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. 2003 తర్వాత శ్రీలంకలో ఇంతటి స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారి. అప్పట్లో దాదాపు 250 మంది చనిపోగా.. 10,000 ఇళ్లు కూలిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: