డొనల్ద్ ట్రంప్ అధికారం లోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక భారత్కు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ లో చాలా పెరుగుదల కనిపిస్తుంది. ఈ పెరుగుదల బారక్ ఒబామా పాలనలో కంటే అధికమే. తాజాగా విడుదలచేసిన అమెరికా అధికారిక సమాచారం ప్రకారం భారత జాతీయులకు వీసాల్లో గణనీయంగా 28% పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు అమెరికా విధించిన "ట్రావెల్ బ్యాన్ దేశాలు" లిష్ట్ లో పాకిస్తాన్ లేకపోయినా ఆ దేశీయులకు వీసాల్లో మాత్రం భారీ కోత పెట్టారు.
గతేడాది మార్చి, ఏప్రిల్లతో పోలిస్తే ఈ ఏడాది అవే నెలల్లో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో పాక్ జాతీయులకు 40% తగ్గించారు. నిరుడు బరాక్ ఒబామా పాలనలో పాక్ జాతీయు లకు 78,637 వీసాలు జారీ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే నెలకు సరాసరి 6,553 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో 3,973, ఏప్రిల్లో 3,925 వీసాలు జారీ చేశారు. గతే డాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో 20 శాతం వీసాలు తగ్గించారు. ఇక భారతీయులకు బరాక్ ఒబామా సర్కార్ గతసంవత్సరం మొత్తం 8,64,987 వీసాలు జారీచేసింది. ఆ ఏడాదిలో సరాసరి నెలకు 72,082 వీసాలు. అయితే ఈ ఏడాది మార్చిలో భారత జాతీయులకు 87,049, ఏప్రిల్లో 97,925 వీసాలు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మొత్తంగా చూస్తే పాకిస్తానే కాకుండా ముస్లిం దేశాలకు వీసాల జారీల్లో అమెరికా భారీ కోత పెట్టింది. ఈ వివరాలను పాక్ మీడియా సోమవారం వెల్లడించింది.
ఇక ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న ఇరాన్, సిరియా, సూడాన్, సోమాలియా, లిబియా, యెమెన్ దేశాలకు జారీ చేసిన వీసాల్లో 55 శాతం తగ్గుదల కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే అద్భుతం అనుకున్న బరాక్ ఒబామా పాలనా కాలంలో కంటే మనం ఎంతగానో విమర్శించే డొనాల్డ్ ట్రంప్ పాలనాకాలమే భారత్ కు మంచిగా ఉన్నట్లు లెఖ్ఖ.