ఈసారి నిజంగానే గుడ్ బై..! టీడీపీలోకి నేడో రేపో బుట్టా రేణుక !!

Vasishta

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీ నుంచి గెలిచారు. గెలిచిన కొన్ని రోజులకే ఢిల్లీలో సీఎం చంద్రబాబుతో కలవడంతో ఆమె టీడీపీలోకి రాబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. నాటి నుంచి నేటి వరకూ ఆమెపై ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.


          బుట్టా రేణుక వైసీపీలో ఉంటూనే టీడీపీనేతలతో సఖ్యతగా ఉంటున్నారు. కర్నూలు జిల్లాకు సీఎం వెళ్లిన ప్రతిసారి ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. రెండ్రోజులక్రితం సీఎం కర్నూలు జిల్లాలో పర్యటించారు. నోబెల్ విజేత కైలాశ్ సత్యార్థి ర్యాలీకి హాజరయ్యారు. ఈ సమయంలో బుట్టా రేణుక కూడా చాలా యాక్టివ్ రోల్ పోషించారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి పాల్గొన్నాను అని చెప్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఆమె టీడీపీ నేతగానే చెలామణీ అయినట్టు తాజా సమాచారం.


          బుట్టా రేణుకపై వైసీపీలో కూడా చాలా కాలం నుంచే అనుమానాలున్నాయి. గతంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి కూడా రేణుక హాజరయ్యారు. అదే సమయంలో ఆమె చంద్రబాబు టూర్ లో పాల్గొన్నారు. దీనిపై ఆగ్రహించిన జగన్.. ఆమె ఉంటే ఉండమను లేకుంటే వెళ్లమను అని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. అయితే అప్పటికి మాత్రం ఆమె వైసీపీని వీడే ఉద్దేశం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.


          అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రేణుక వైసీపీని వీడడానికి సిద్ధమైనట్టు సమాచారం. ముందుగా ఆమె సన్నిహితులను టీడీపీలోకి పంపి తర్వాత ఆమె సైకిలెక్కనున్నారు. ఈ నెలాఖరులోపే ఆమె టీడీపీ కండువా కప్పుకుంటారనేది పక్కా సమాచారం. మరి చూద్దాం.. ఈసారైనా నాన్నా పులి కథకు ముగింపు పడుతుందేమో..!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: