దత్తన్నకు మోదీ ఇంత అన్యాయం చేస్తారా..!?

Vasishta

దసరా సందర్భంగా అలయ్ బలయ్ నిర్వహించడం మాజీ మంత్రి దత్తాత్రేయకు అలవాటు. పార్టీలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈసారి అలయ్ బలయ్ కార్యక్రమం దత్తన్న పాలిట ఓదార్పు సభలా మారిపోయింది.


          రెండు నెలల క్రితం వరకూ దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దత్తాత్రేయకు మంత్రి పదవి ఊడిపోయింది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దత్తన్నను మంత్రి పదవి నుంచి తొలగించడం ఆ ప్రాంతవాసుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. అయ్యో.. దత్తన్నకు మంత్రి పదవి పోయిందే.. అని అందరూ బాధపడ్డారు.


          దసరా సందర్భంగా జరిగిన అలయ్ బలయ్ లో కాంగ్రెస్ నేత వీ.హెచ్.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనను కలిగించాయి. దత్తాత్రేయకు ప్రమోషన్ వస్తుందని ఆశిస్తే.. ఉన్న పదవి ఊడగొట్టారన్నారు. బీసీలకు మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారనుకుంటే.. అగ్ర కులాలను తెచ్చి పెట్టుకుని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. దత్తాత్రేయకు పదవి తొలగించడంతో బీసీలంతా ఆవేదనతో ఉన్నారని వీహెచ్ అన్నారు.


          టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవ రావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు పదవి తొలగించడం న్యాయం కాదన్నారు. అయితే ఆయన్ను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని.. ఆయనకు మరిన్ని మంచి పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


          ఓవరాల్ గా గత అలయ్ బలయ్ సమావేశాలతో పోల్చితే ఈసారి మాత్రం పూర్తిగా దత్తన్న చుట్టూనే జరిగింది. దత్తాత్రేయను చూసి అందరూ బాధపడడం, ఓదార్చడం కనిపించాయి. దత్తన్న మంత్రి పదవిలో ఉండి ఉంటే.. అలయ్ బలయ్ మరింత ఘనంగా జరిగి ఉండేదని హాజరైనవారు గుసగుసలాడుకోవడం కనిపించింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: