గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో జరగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి మొదలైన రాజకీయ క్రీడ ఆమె మరణించిన తర్వాత రసకందాయలంలో పడింది. అమ్మకు ఎంతో నమ్మినబంటుగా ఉంటున్న పన్నీరు సెల్వం వర్సెస్ శశికళ మద్య ఆదిపత్య పోరు మొదలైంది.
అంతే కాదు తమిళనాడు సీఎం సీటు కోసం చిన్నమ్మ ఎన్నో రాజకీయాలు చేసినా..అక్రమ ఆస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షఅనుభవించాల్సి వచ్చింది. ప్రస్తుతం చిన్నమ్మ పరప్పన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, భర్త ఆరోగ్యం బాగాలేక పోవడంతో, ఆయన్ను చూసేందుకు అనుమతి ఇవ్వాలని, శశికళ కోర్టులో పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే.
తన భర్తకు అవయవమార్పిడీ జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న శశికళకు షరతులతో కూడిన పెరోల్ మంజూరైంది. కేవలం భర్తను చూడటానికే మాత్రమే అనుమతి ఉందని.. రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించింది కోర్టు. ఒకవేళ శశికళ రాజకీయ సంబంధ కార్యక్రమాల్లో తలదూర్చితే పెరోల్ రద్దు చేస్తామని జైళ్ల శాఖ హెచ్చరించింది.
మీడియా ప్రకటనలు కూడా చేయకూడదని శాసించింది. బంధువుల ఇంట్లో ఉండాలని సూచించింది. 15 రోజులు పెరోల్ ఇవ్వటానికి కుదరదని.. కేవలం ఐదు రోజులు మాత్రమే ఇచ్చింది. దీంతో బెంగుళూరు నుంచి నేరుగా చెన్నైకి శశికళ వెళ్లనున్నారు.
మరోవైపు శశికళ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆమె మేనల్లుడు దినకరన్ తన మద్దతుదారులతో శుక్రవారం ఉదయం జైలు వద్దకి చేరుకున్నారు. ఈ నేఫథ్యంలో శశికళతో పాటు అన్నాడీఎంకే నేతల కదలికలపై తమిళనాడు ప్రభుత్వం నిఘా వేసింది. చిన్నమ్మకు గ్రాండ్గా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.