తెరాస పార్టీ అంటే చాలు తెలంగాణా లో తిరుగు అనేది లేని ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం అనేది చాలా చిన్న విషయం గా వారు ఇప్పటికే కాన్ఫిడన్స్ తో ఉన్నారు. గడిచిన మూడు దశాబ్దాలలో జరగని పనులు అన్నీ తెరాస అధికారం చేపట్టగానే జరిగిపోయాయి అని చాలా మంది ధృడంగా చెబుతూ ఉంటారు.
అభివృద్ధి పేరుతో గొర్రెలు పంచారు, చీరలు పంచారు, ఇంకేవేవో కానుకలు ఇచ్చామంటున్నారు. తెరాసపై ప్రజా వ్యతిరేకతే లేదన్నట్టుగా చిత్రీకరిస్తారు. కాంగ్రెస్ కి భయపడేది లేదంటారు, టీడీపీకి బదులు పలికేది లేదంటారు, భాజపా తమకు సమాన ప్రత్యర్థి కాదనీ చెబుతారు! కానీ టీ జేఏసీ విషయం లో మాత్రం తెరాస, కెసిఆర్, ఆయన మనుషుల పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటూ వస్తోంది.
టీ జేఎసీ చేసే ఏ చిన్న కార్యక్రమం అయినా వారి కంగారు ఇంతే ఉంటోంది. తాజాగా కోదండరాం స్ఫూర్తి యాత్ర అనగానే తెరాస అడ్డుకోవాలని ఆటంకాలు కలిపించాలి అనీ చూస్తున్నట్టు టీ జేఏసీ ప్రధాన ఆరోపణ. వరంగల్ లో ఆరో దశ అమరవీరుల స్ఫూర్తి యాత్ర విషయం గురించి చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం అసలు అనుమతులే ఇవ్వము పొమ్మని ఏదో ఒక కారణం చెబుతోంది.
తాము శాంతియుతంగా యాత్ర నిర్వహించుకుంటే కార్యకర్తల్ని అరెస్టు చేసి, మానవ హక్కుల ఉల్లంఘనకు కేసీఆర్ సర్కారు పాల్పడిందని మండిపడ్డారు కోదండరాం. ప్రధాన మీడియా సంస్థలు ఎప్పుడూ కోదండరాం సభల మీద కార్యక్రమాల మీదా దృష్టి పెట్టలేదు కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. అయినా సరే ఆయన మీద ఇలాంటి పర్మిషన్ లేని నాటకాలు ఆడుతోంది అధికార తెరాస.