ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కించేదిగా ముఖ్యంగా ఉభయ గోదావరులు సహా పలు జిల్లాల్లో పార్టీకి తిరుగులేని మెజార్టీ తెచ్చిపెట్టేదిగా భావిస్తున్న పోలవరం విషయంలో కేంద్రం ఎక్కడికక్కడ మోకాలడ్డుతోంది. వాస్తవానికి 2018 నాటికి దీనిని పూర్తి చేయాలని బాబు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం ఇచ్చేదాకా కూడా ఆగకుండా సొంత నిధులను వెచ్చిస్తున్నారు. అయినా కూడా పోలవరం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
దీనికి ప్రధాన కారణం.. కేంద్రం నిధులు సక్రమంగా విడుదల చేయకపోగా, పక్కనేఉన్న ఒడిసా రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్న విధంగా పోలవరానికి సాధ్యమైనంత వరకు జాప్యం చేస్తున్నారు. అంతేకాదు, ఇది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి.. మేం నిపుణులను పంపిస్తాం.. వారు పరిశీస్తారు అంటూ.. ఇటీవల కేంద్రం ఓ నిపుణుల కమిటీని పోలవరానికి పంపింది. వీరు ఓ నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఇప్పుడు ఈ నివేదికే పోలవారిని పెను గండంగా పరిణమించింది. ‘ఎంతో కీలకమైన… పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలో ఏపీ జలవనరుల శాఖకే స్పష్టత లేదు. భారీగా పెరిగిన భూ సేకరణ..ఆర్అండ్ ఆర్ వ్యయంతో ప్రాజెక్టు లాభదాయకతపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది` అని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది.
అంతేకాదు,బాబు ప్రభుత్వం కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకుందని, దీని ఎత్తును 31 మీటర్ల నుంచి 42 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రతిపాదించిందని కేంద్ర నిపుణుల కమిటీ ఈ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టును చాలా ముందుగా పూర్తి చేయటానికి ఇలా చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని పేర్కొంది. దీనివల్ల చాలా అంశాలు సమస్యలుగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. 42 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలంటే ఆ మేరకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయాలని, 2019 జూన్ నాటికి మొత్తం కెనాల్ డిస్ట్రిబ్యూషన్ పనులను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఇది సాధ్యమయ్యే పనికాదని చెప్పడం గమనార్హం. దీంతో కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపుపై పీట ముడి పడింది.
ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సమర్పించిన నిర్మాణ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ కు సంబంధించి ఎలాంటి వివరాలు అందివ్వలేదని కమిటీ తన నివేదికలో ప్రధానంగా పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనం పూర్తిగా రైతులకు చేరాలంటే ఇది చాలా కీలకమని కమిటీ నివేదించింది. కమిటీకి ప్రభుత్వం పవర్ హౌస్ కాంపోనెంట్స్ నిర్మాణానికి సంబంధించి వివరాలు సమర్పించలేదని తెలిపింది. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ ఖర్చు 2934 కోట్ల రూపాయల నుంచి 32392.24 కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొంది. ఈ పరిణామాల క్రమంలో కేంద్రం దీనిపై ఇక నుంచి ఆచితూచి అడుగులు వేసే చాన్స్ కనిపిస్తోంది. మరి బాబు ఎన్నికల వ్యూహంలో ప్రధాన భూమిక పోషించే ఈ ప్రాజెక్టు ఇక, నత్తనడకన సాగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక్కడే మనం ఒకమాట చెప్పుకోవాలి.
పోలవరం కాఫర్ డ్యాం విషయంలో వివాదం ఉందని, దీనిని బాబు అత్యుత్సాహంతో చేపడుతున్నారని, రెండు నెలల కిందట రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యానించారు. దీనికి కనుక కేంద్రం అడ్డు చెబితే.. పోలవరం పూర్తిగా ఆగిపోతుందని ఆయన అన్నారు. అంతేకాదు, బాబు చేస్తున్న హడావుడితో భూ సేకరణ కూడా పెరుగుతుందని, దీనికి కూడా కేంద్రం ఒప్పుకోదని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ నిజమవుతుండడం కూడా బాబుకు చేదుగుళికగానే మారింది. మరి బాబు ఈ విషయంలో చక్రం ఎలా తిప్పుతారో చూడాలి.