అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక రష్యా గూఢచార వ్యవస్థ కృషి చాలా ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. అలాగే నేడు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం మన దాయాదిదేశం పాకిస్థాన్ పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికి మణిశంకర్ అయ్యర్ గృహమే వేదికైందని ఈ కుతంత్రం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సముఖంగా జరిగిందని బాజపా ఆరోపిస్తుంది.
గుజరాత్ జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో పాకిస్తాన్ మితి మీరిన జోక్యం చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆదివారం ఉత్తర గుజరాత్ లోని పాలన్పూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్తాన్ నేతలతో ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ గుజరాత్ సీఎం కావాలంటూ పాకిస్తాన్ మాజీ ఆర్మీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షద్ రఫీక్ కోరటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
"మణిశంకర్ అయ్యర్ నివాసంలో జరిగిన సమావేశంలో, పాకిస్థాన్కు మాజీ ఆర్మీ డైరెక్టర్ జనరల్ అర్షద్ రఫీఖ్ గుజరాత్ సీఎంగా అహ్మద్ పటేల్ని చేయాలని అంటున్న సమయంలో పాకిస్తాన్ హై కమిషనర్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ భేటీ లో పాల్గొన్నట్లు మీడియా వార్తలొచ్చాయి. అందులో భాగంగానే అహ్మద్ పటేల్ ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తెస్తూ గుజరాత్ లో పోస్టర్లు వెలిశాయని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలన్పూర్ సభల్లో ఆయన మాట్లాడారు.
పాకిస్థాన్ హైకమిషనర్తో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ రహస్యంగా ఎందుకు భేటీ కావాల్సి వచ్చిందని మోదీ ప్రశ్నించారు. "ఈ రోజు పేపర్లలో మీరు చదివే ఉంటారు. నా మీద "నీచ్" ఆరోపణలు చేయడానికి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఇంట్లో పాకిస్థాన్ హైకమిషనర్, పాక్ విదేశాంగ మంత్రి, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. వీరి నడుమ 3గంటలపాటు సుదీర్ఘ భేటీ జరిగింది. ఆ మరుసటి రోజే నాతో సహా గుజరాత్ ప్రజలందరినీ అవమానించేలా అయ్యర్ నీచ్ వ్యాఖ్యలు చేశారు" అని నరెంద్ర మోదీ పేర్కొన్నారు.
దేశ భద్రతకు భంగం కలిగించే ఈ అనుమానాస్పద భేటీలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలన్నారు. గుజరాత్ ప్రజలను అవమానించడమే వారి సమావేశం ప్రధాన ఉద్దేశమని, వారి కుట్రలను గుజరాత్ ప్రజలు తిప్పికొట్టాలని, రాష్ట్రం నుంచి కాంగ్రెసును తరిమికొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్రాన్ని తాను ఆర్థికంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లానని, కానీ కాంగ్రెస్ కుల రాజకీయాలతో గుజరాత్ను ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు.
తనపై ఇటీవల కాంగ్రెస్ నేతలు సూట్—బూట్ సర్కార్ అంటూ చేస్తున్న విమర్శలనూ మోదీ తిప్పికొట్టారు. యూపీఏ పదేళ్లలో, ఎన్డీయే మూడేళ్ల లో పద్మ అవార్డులు అందు కుంటున్న వారి జాబితాయే పేదల పక్షపాతి ఎవరో వివరిస్తాయని సనంద్ లో జరిగిన సభలో మోదీ తెలిపారు. "మారుమూల ప్రాంతాలైన సనంద్, వీరంగామ్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తాయని ఎవరైనా అనుకున్నారా? గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తే, బీజేపీ దీన్ని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్రంగా మార్చిందన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు టాటా నానో, మారుతి సుజుకి, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలతో వేల మందికి ఉపాధి కలుగుతుంది" అని అన్నారు.
అవినీతి, కుల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘అవినీతిని అలవాటుగా మార్చుకున్న వారు దేశాన్ని బాగుచేయలేరు. రాష్ట్రాన్ని కులం పేరుతో విడగొడుతున్నారు’ అని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పంచమహల్ కాలోల్ లో జరిగిన సభలో మోదీ పేర్కొన్నారు.
గొంతు నొప్పితో బాధపడుతున్న మోదీ తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను బుజ్జ గించడం ద్వారా వారి ఓట్లతో నైనా గట్టెక్కాలని చూస్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా విమర్శించారు.
గుజరాత్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం కొద్దిగా పెరుగుతుందని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు. ఆదివారం గుజరాత్లోని వదోదరలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి భారంగా మారడం వల్లే మణిశంకర్ అయ్యర్ను ఆ పార్టీ బహిష్కరించిందని కేంద్రమంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నుంచి బహిష్కరించాల్సిన తొలి వ్యక్తి సోనియా గాంధీ అని, 2014 ఎన్నికల సమయంలో ఆమె నరెంద్ర మోదీని మృత్యు బేహారిగా అభివర్ణించారని ఉమాభారతి గుర్తు చేశారు.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఈ ఎన్నికల్లో ఓడిపోయేందుకు కాంగ్రెస్ నేతలు బీజేపీ నుంచి "సుపారీ" తీసు కున్నారని గుజరాత్ మాజీ సీఎం, జనవికల్ప్ మోర్చా పార్టీ అధినేత శంకర్ సింహ్ వాఘేలా విమర్శించారు. కాగా, పాక్ అధికారు లతో కాంగ్రె్సనేతలు భేటీ అయ్యారన్న మోదీ వ్యాఖ్యలు నిరాధారమైనవని కాంగ్రెస్ పేర్కొంది.