ఆంధ్రప్రదేశ్ లో గత నెల 6 న ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించారు వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ జిల్లాలో ఆయనకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు. జగన్ అన్నను చూస్తుంటే..రాజన్న వచ్చినట్లుందని ప్రజలు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. సంకల్ప యాత్ర సందర్భంగా జగన్ అధికార పార్టీ తీరు తెన్నుల గురించి..ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చని ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తూ వచ్చారు. అనంతపురం జిల్లా పాపంపేటలో పాదయాత్ర కొనసాగిస్తోన్న జగన్.. సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని అన్నారు.
బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని అదీ చేయలేదని అన్నారు. ఉపాధి, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు ఇస్తామన్నారు ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ ఉన్నారని అన్నారు. ఉద్యోగాలు వచ్చే ఏకైక అవకాశం ప్రత్యేక హోదా అని, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశారని అన్నారు.
గ్రామాల్లో మరుగుదొడ్లు కావాలన్నా లంచం తీసుకుంటున్నారని అన్నారు. ఏపీలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని చెప్పారు. అన్నింటా దోచుకుంటున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రౌడీ మాఫియా రాజ్యమేలుతోందని, ఇలాంటి పరిస్థితులు మారాలని, రాజకీయాల్లోకి విశ్వసనీయత రావాలని అన్నారు.
మన ప్రభుత్వం వస్తే మీ కొడుకు, మీ అన్నగా మహిళలందరికీ అండగా నిలుస్తా’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తానని, ఎన్నికలైన మర్నాడే బ్యాంకులకు వెళ్లి అప్పు ఎంత ఉందో రిసీట్ తీసుకోండని, ఆ మొత్తాన్ని చెల్లిస్తానని అన్నారు.