బాంకింగ్ వ్యవస్థలో దొంగలు చేరారు. అసలు ఆర్ధిక వ్యవస్థల్లో ప్రభుత్వ ప్రమేయమే ఈ ధౌర్భాగ్యానికి ప్రధాన కారణం. నీరవ్ మోడీ ప్రస్థానం 2011 లో ప్రారంభమై 2018 కి తారస్థాయికి చేరింది. నీరవ్ మోడీ తో పాటు రొటొమాక్ కొఠారీ లాంటి వాళ్ళు ఇప్పుడు కోకొల్లలు. ఆర్ధిక వ్యవస్థల్లో వీళ్ళ ప్రవాహానికి కారణం దిక్కుమాలిన మన రాజకీయ వ్యవస్థే. ఈ మద్య ప్రభుత్వరంగ బాంకులు అవినీతి అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, అవినీతి, అవకతవకలు తగ్గాలంటే ఈ బ్యాంకుల్లోప్రభుత్వ వాటాను 50 శాతంకంటే తక్కువకు కుదించాల్సిన అవసరం ఉందని అసోచామ్ అభిప్రాయపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన ₹ 11,400 కోట్ల కుంభకోణం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటా తగ్గింపు అనివార్యం అని సూచిస్తోందని అసోచామ్ గుర్తించింది. ప్రైవేటురంగ బ్యాంకు లకు ధీటుగా పనిచేయాలంటే వాటిలో ఉన్న ప్రభుత్వ వాటాను 50 శాతంకంటే తగ్గించాలని, అప్పుడే వాటాదారుల పట్ల బాంకులకు కొంత బాద్యతపెరుగుతుందని, డిపాజిటర్ల సొమ్ముకు భద్రత చేకూరుతుందని పారిశ్రామిక సంఘం అభిప్రాయపడింది.
విదేశాల్లోని భారతీయబ్యాంకు శాఖల నుంచి స్వదేశంలో సాధించిన ఎల్.ఒ.యు ల ఆధారంగా రుణాలు పొంది వేలకోట్లు అవినీతికి పాల్పడిన నీరవ్ మోడీ కేసుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరేకీకరణ అనివార్యం అని తెలుస్తున్నట్లు అసోచామ్ వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకదానివెంట ఒకటి సంక్షోభాలకు నెలవుగా మారుతున్నా యని అందువల్ల వాటికి "బెయిల్ ఔట్ పాకేజి" ఇవ్వడానికి సైతం ఒక పరిమితి ఉంటుందని పన్నుచెల్లింపుదారుల సొమ్ముతోనే వాటికి ప్యాకేజిలు ప్రకటిస్తున్నదని అసోచామ్ చురకలు వేసింది. ఇలా బెయిల్ ఔట్ పాకేజీలు ప్రకటిస్తూ గత కొన్ని దశాబ్ధాలుగా ప్రభుత్వంలోకి చేరి సంవత్సరాలతరబడి పేరుకుపోయి తిష్ఠ వేసిన నేరగాళ్ళు నేపధ్యంలో ఉండి ప్రజాధనం లూటీ చేస్తున్నారని ప్రతి బాంకింగ్ నేర నేపథ్యంలో కొన్ని అదృశ్యశక్తులు ఉండి ఉంటాయని భావిస్తున్నాయి ఉద్యోగవర్గాలు.
చాలా సంధర్భాల్లో బాంకింగ్ అధినేతల వెనుక నుండి కొన్ని దోపిడీ శక్తులు పనిచేయటం గత అనేక సంవత్సరాల నుండి జరుగుతూనే వస్తుంది. ఇపుడు బ్యాంకింగ్ రంగం లోని అత్యున్నత స్థాయి ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు పొడిగింపుగా వస్తున్నాయని, వారి నాణ్యతా ప్రమాణాలు అధికార వికేంద్రీకరణ అంత ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయి వారి ఆదేశాలమేరకు మాత్రమే నడుస్తున్నట్లు తేలింది. దీనితో కోర్ బ్యాంకింగ్ విధులు మందగిస్తున్నాయి. అంతేకాకుండా రిస్క్ మేనేజ్మెంట్ అంశం వెనక్కు తగ్గుతోంది.
ఒకసారి ప్రభుత్వం బ్యాంకుల్లో తన వాటాను 50 శాతం కంటే తగ్గించుకున్నపక్షంలో కొంత స్వయం ప్రతిపత్తి కలుగుతుందని, బాద్యత, అంకితభావం వంటివి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. బ్యాంకుల బోర్డులు విధివిధానాలు నిర్ణయిస్తే వాటి సిఇఒ లు పూర్తి అధికారయుతంగా విధినిర్వహణ చేస్తారని, దీనివల్ల బాద్యత పెరుగుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాలు వంటివి కొంత తగ్గుతాయని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన కొత్త టెక్నాలజీ అమలులో కొన్ని లోపాలు ఉండటం వల్లనే ఇలాంటి భారీ కుంభకోణాలు జరుగుతున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ అన్నారు. బ్యాంకింగ్ రంగానికి స్వఛ్ఛమైన బ్యాంకింగ్ బిజినెస్ ప్రమాణాలు రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడాలని ఆయన అన్నారు.
ఇందుకోసం రిజర్వుబ్యాంకు నాయకత్వ పాత్రపోషించాల్సి ఉంటుంది. ఇక ఆర్ధికరంగంలోని మొత్తం వ్యాపారాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వరంగం అయినా, ప్రైవేటు రంగం అయినా బ్యాంకింగ్ రంగంలో నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం ప్రక్షాళనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కింద నుంచి పైవరకు ప్రక్షాళన జరగక పోతే ప్రతి పౌరుడు తాము చీమల్లా కష్ఠపడి సంపాదించి నిలవ చేసుకున్న సేవింగ్స్ పుట్టల్లోకి రాజకీయ పాములు చేరితే దేశానికి యోగదాయకం కాదు. చీమల సంపాదన ఎలాంటి పరిస్థితుల్లో పాముల పాలు కారాదు అంటుంది అసోచాం.