వచ్చే నెలలో రాజ్య సభ కు ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వైసిపి నుంచి ఎవరు భరిలోకి దిగుతారా అని అందరికి ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 45మంది. ఇక రాజ్యసభ సీటు దక్కాలంటే ఉండాల్సిన సంఖ్య 44.అంటే ఒక ఎమ్మెల్యే ఎక్కువగానే ఉన్నారు.కాబట్టి ఖచ్ఛితంగా వైసీపీ ఖాతాలో రాజ్యసభ సీటు వచ్చిపడినట్లే కానీ, ఇద్దరు ఎమ్మెల్యేలను అధికార టీడీపీ తమవైపుకు తిప్పుకుంటే ఆ సీటు కాస్తా గోవిందా.అందుకే వైసీపీ అధినేత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా ప్రణాళికను రచిస్తున్నారు.కానీ,తమ పార్టీకి దక్కే ఆ ఒక్క సీటుకు ఎవర్ని దింపాలా అన్న చర్చ సుధీర్ఘంగా జరిగింది.మొత్తంగా అభ్యర్థిని ప్రకటించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరనుకుంటున్నారా. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
ఈయన ఇటీవలే వైసీపీలో చేరాడు.గతంలోనూ వైసీపీలో కొనసాగిన వీపీఆర్, పార్టీలో తగిన గుర్తింపు లభించటం లేదని వైఎస్ జగన్ పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ టీడీపీలో చేరాడు. అక్కడ రాజ్యసభ సీటు వస్తుందని కల కన్నాడు.కానీ అక్కడా మొండి చేయే ఎదురవటంతో తిరిగి జగన్ గూటికి వచ్చాడు.రావటం తప్పు కాదు కానీ,వచ్చిన వెంటనే ఆయన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడమే ఇప్పుడు వైసీపీ నేతలను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది.