షాక్ : చంద్రబాబు సెటైర్..! జేసీ కౌంటర్..!!

Vasishta

జేసీ దివాకర్ రెడ్డి.. ఏం మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంటారు. ఆయనతో పెట్టుకుంటే చీల్చి చెండాడుతుంటారు. భోళాతనంగా ఆయన మాట్లాడే మాటలు కొంతమందికి నవ్వు తెప్పిస్తే.. ఆ మాటల్లోని అంతరార్థం మరికొంతమందిని ఆలోచింపజేస్తుంది. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి –చంద్రాబు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.


  పార్లమెంట్ లో ఎంపీల పోరాటం ఉధృతంగా సాగుతోంది. ఎంపీలందరూ పోడియంను చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. అయితే సోమవారం ఆయన పార్లమెంటుకు డుమ్మా కొట్టి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు జేసీతో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఆవైపు వచ్చిన సీఎం చంద్రబాబు జేసీని చూసి ఆశ్చర్యపోయారు.


          జేసీని చూసి చంద్రబాబు స్కూల్ ఎగ్గొట్టి ఎందుకొచ్చావ్.. స్కూల్ కు వెళ్లకపోతే ఫెయిలైపోతావ్.. అని సెటైర్ వేశారు. అంటే.. పార్లమెంటుకు వెళ్లకుండా ఇక్కడికెందుకొచ్చారు అని చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ కు వెళ్లకపోతే ఫెయిలైపోతారు.. అని చమత్కరించారు. అయితే జేసీ కూడా చంద్రబాబుకు అంతే స్థాయిలో సెటైర్ విసిరారు. తానెప్పుడూ ఫెయిల్ కానన్నారు. స్కూల్ ఎగ్గొట్టినవారు, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నవాళ్లే పైకొచ్చారని నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.


          రాజ్యసభకు వెళ్తారా.. అని మీడియా ప్రశ్నించినప్పుడు తానెప్పుడూ ప్రజల నుంచే వస్తానన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడమే తనకు సంతోషాన్నిస్తుందన్నారు. పరోక్ష రాజకీయాల్లోకి తానెప్పుడూ రానన్నారు. ప్రజలు ఎన్నుకోవడం ద్వారా చట్టసభలకు వెళ్లడానికి, పరోక్షంగా వెళ్లడానికి చాలా తేడా ఉంటుందన్నారు. తనకు అది ఇష్టం లేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: