కాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ..! పవన్ ప్రకటనపై భారీ అంచనాలు..!!

Vasishta

తెలుగురాష్ర్టాల్లో జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతోందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది. అమరావతిని తన చిరునామాగా మార్చుకున్న పవన్.. పొలిటికల్ వ్యూహాలకు సంబంధించి స్పీడ్ పెంచారు. కాసేపట్లో జరిగే జనసేన ఆవిర్భావ సభలో కీలక ప్రకటన చేస్తానంటూ ఇప్పటికే ఓ టీజర్ కూడా వదిలారు. అయితే ఈ సమావేశంలో జనసేన ప్రకటించబోయే రాజకీయ నిర్ణయాలు.. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా?


జనసేన ఆవిర్భావం ఓ సంచలనం.. పార్టీ నిర్మాణం, విధానాలు దేశంలో రాజకీయ పార్టీలకు భిన్నం... పవన్ అనే సమ్మోహన శక్తి చుట్టే పార్టీ నిర్మాణం అయింది.. రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ ఇన్నాళ్లూ తన ఉనికిని చాటుకుంది. అంతేకాదు పవన్ కూడా ఓ రాజకీయ నాయకుడిలా కాకుండా.. ఓ సామాజిక కార్యకర్తలా.. ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించారు..


ఇన్నాళ్లూ.. ప్రజాసమస్యలపై, ప్రజాఉద్యమాలకే పరిమితమై జనసేన తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగబోతోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న జనసేనాని అమరావతి వేదికగా.. తన కార్యచరణకు పదునుపెట్టారు. ఇందులో భాగంగా నాలుగో ఆవిర్భావ వేడుకులను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది జనసేన పార్టీ. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తిచేసింది జనసేన. వేలాది మంది అభిమానులు,కార్యకర్తల సమక్షంలో జనసేనాని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు.


ఇప్పటిదాకా ట్రైలర్ మాత్రమే చూశారు.. అసలు సినిమా ఇకనుంచి చూస్తారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని.. జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ముందున్న పవన్.. ఇకపై జనసేన ద్వారా ఉద్యమాన్ని పతాకస్థాయికి చేర్చాలనే వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ప్రజా ఉద్యమాలు, ప్రత్యేకహోదా తో పాటు విభజన హామీల సాధన కోసం జనసేన ఉద్యమించబోతోంది. అయితే అది ఎలా ఉంటుందనేది ఈ సభలో స్పష్టం చేయనున్నారు జనసేనాని..


సమస్య ఏదైనా.. దాని మూలాల నుంచి శోధించి.. పరిశోధించి.. పరిష్కరించుకుంటూ వస్తున్న జనసేన.. విభజన సమస్యలపైనా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి.. ప్రజల్లోచైతన్యం తీసుకొచ్చారు. ఇదే పవన్ చిత్తశుద్ధికి నిదర్శనం అనేది ఆపార్టీ నేతల వాదన. అంతేకాదు.. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమైతే పవన్  కల్యాణ్.. నిపుణులు, డాక్టర్లతో కలిసి ఉద్దానం బాధితుల పక్షాన పోరాడి.. వారికి న్యాయం చేయడంలో సక్సెస్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లోనూ ఇదే ఒరవడి సృష్టిస్తారని.. జనసేన నాలుగో ఆవిర్భావ సభ ..ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడం ఖాయమనే ధీమాలో ఉంది జనసేన సైన్యం..


ఓవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ.. రెండు బలమైన రాజకీయ ప్రత్యర్ధులను ఢీకొట్టబోతున్న పవన్.. వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, రాజకీయ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై తీవ్రంగా కసరత్తు చేశారు. మేధావులు, సీనియర్ పొలిటీషీయన్స్ సలహాలు తీసుకున్న పవన్.. ఈ ఆవిర్భావ సభలో కీలక ప్రకటన చేయబోతున్నారు. అయితే ఆ నిర్ణయాలు.. ఆంధ్రప్రదేశ్  రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా ఉంటాయా లేక .. మూసధోరణిలో ఉంటాయా అనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: