పవన్ ప్లేట్ ఫిరాయింపుతో పిచ్చెక్కిపోతున్న జనాలు..!!

Vasishta

ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలు తెగ మలుపులు తిరుగుతున్నాయి. కాదు.. కొందరు నేతలు ఈ మలుపులు తిప్పుతున్నారు. సినిమాల్లో ట్విస్టుల్లాగా పాలిటిక్స్ లోనూ ట్విస్టులు ప్లే చేస్తున్నారు. ఈ ట్విస్టుల వెనుకున్న ట్రిక్ లు ఏంటో సామాన్యులకు అర్థం కావడం లేదు. ఏడాదిలో జనరల్ ఎలక్షన్స్ ఉండడంతో ఇప్పటి నుంచే రాజకీయ హీట్ రాజేస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా ఉన్న పార్టీల మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కలిసున్న నేతలు ఒకరిపై ఒకరు బాహాటాంగానే ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.


అధికార పార్టీ టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన యూ టర్న్ తీసుకుంది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో సీఎం చంద్రబాబు పాలనపై జనసేన అధినేత నిప్పులు చెరిగారు. వ్యవస్థలో అవినీతి పెరిగిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను నాలుగేళ్లుగా కాంప్రమైజ్ అవుతున్నా పాలన గాడిలో పడడం లేదని విమర్శించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ పైనా పవన్ అవినీతి ఆరోపణలు చేయడం అధికారపక్షానికే కాదు ఇతర పక్షాలు, మేధావివర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న టీడీపీ శ్రేణులు పవన్ వ్యాఖ్యలను తిప్పిగొట్టారు. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్థరహితమని తోసిపుచ్చారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వవన్ ని నిలదీస్తూ ప్రకటనలు గుప్పించారు.


తాజాగా కేంద్ర అధికార పార్టీపై హీరో శివాజీ కూడా సంచలన ఆరోపణలు గుప్పించారు. దక్షిణాది రాష్ర్టాల్లో అధికారం కోసం ఓ జాతీయ పార్టీ కుట్రపన్నుతున్నదని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఇందుకోసం రాష్ర్టాల వారీగా పథకాలు రూపొందిస్తున్నదని.. ద్రవిడ, గరుడ, రావణ, కుమార వంటి పేర్లతో ప్రణాళికలు రచించారని జోస్యం చెప్పారు. అయితే శివాజీ చేసిన ఈ ఆరోపణలు కూడా నిరాధారమే. పవన్ కల్యాణ్ రాష్ర్ట అధికార పార్టీపై ఆరోపణలు చేస్తే.. శివాజీ ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆరోపణలు చేశారు. ఈ రెండింటిలో కామన్ పాయింట్లు ఉన్నాయి. ఆరోపణలు చేసిన ఇద్దరు నేతలూ సినీ రంగం నుంచి వచ్చిన వాళ్లే. అంతేకాదు ఇన్నాళ్లూ అవే పార్టీల్లో ఉన్న నేతలే. పవన్ టీడీపీకి మిత్రపక్షంగా ఉంటే.. శివాజీ 2014 ఎన్నికల సమయంలో బీజేపీలోకి చేరి తరువాత బయటకు వచ్చారు. ఈ రెండు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలే..!


ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికార పార్టీలపై ఈ విధంగా ఆరోపణలు చేయడం ఆలోచించాల్సిన విషయం.. తెలుగు రాష్ర్టాల్లో ఇమేజ్ ఉన్న పవన్ ఆరోపణలు.. బాగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీపై శివాజీ చేసిన ఆరోపణలు ఆలోచనలో పడేశాయి. రానున్న ఎన్నికల్లో రాష్ర్టంలో టీడీపీ విజయానికి పవన్ మొకాలడ్డు పెట్టడం చంద్రబాబుకు మింగుడుపడని అంశం. గత ఎన్నికల్లో తమ విజయానికి సహకరించిన పవన్.. ఈసారి ఎదురుతిరిగారని టీడీపీ భావిస్తోంది. దీనిని బలంగా ఎదుర్కొనేందుకు టీడీపీ దీర్ఘంగా యోచిస్తోంది. విభజన హామీలతో పాటు, హోదా ఇవ్వని కేంద్రంపై ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. విభజన హామీలు అమలుపరచిన బీజేపీ తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. తమపై పవన్ చేసిన ఆరోపణల వెనుక బీజేపీ ఉందంటూ టీడీపీ వర్గాలు విమర్శలు మొదలుపెట్టాయి. బీజేపీపై ఆరోపణలు చేస్తోన్న టీడీపీ కూడా నిన్న, మొన్నటి వరకు మిత్రపక్షమే. ఇన్నాళ్లూ కలిసున్న మిత్రపక్షాలు.. వైరి పక్షాలవుతున్నాయి. మిత్రపక్షంపై నేతలు ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలు ముందుకు వస్తున్నారు. అధికార పక్షాలపైనే ఘాటైన విమర్శలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలో తెలియని స్థితిలో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తానికి పార్టీలన్నీ కలిసి జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: