తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన డీఎన్ఏ పరీక్ష కేసు మరో మలుపు తిరిగింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ తాను జయలలిత కుమార్తెనని, కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేసుకోవచ్చని చెబుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రక్తానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని అపోలో ఆసుపత్రికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వివరాలను గురువారం సమర్పించాలని ఆదేశించింది. అమృత సారథి (37) అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది.
ఇందులో భాగంగా 2016లో జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమెకు సంబంధించిన బయోలాజికల్ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా, లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని అపోలో ఆస్పత్రిని కోర్టు బుధవారం (ఏప్రిల్ 25) ఆదేశించింది. అయితే.. అపోలో ఆస్పత్రి తమ వద్ద జయలలితకు సంబంధించిన బయోలాజికల్ శాంపుల్స్ ఏమీ లేవని కోర్టుకు తెలిపింది. ఇంతకుముందు.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి సీసీటీవీ దృశ్యాల గురించి కోరగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇదేవిధమైన సమాధానం చెప్పి అందర్నీ షాక్కు గురిచేసింది.
మరోవైపు అన్నాడీఎంకె కార్యకర్తలు, అమ్మ అభిమానులు ఆమె మరణం వెనుక రహస్యం ఉందని..పూర్తి విచారణ చేపట్టాని ఇప్పటికే పలు మార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేయగా.. ఆమె చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాలను స్విచ్ఛాఫ్ చేసినట్లు అపోలో వర్గాలు తెలిపాయి. కాగా 2016 సెప్టెంబర్లో అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన జయలతిత అదే ఏడాది డిసెంబర్ 5న మృతిచెందిన విషయం తెలిసిందే.