ఒకే జాతి రాజకీయ కారణాలతో బద్ధశత్రువులై ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలుగా విడిపోయాయి. ప్రపంచ శాంతికే విఘాతం కలిగించాయి. అనుకోకుండా పల్లవించిన స్నేహ సుమం వారిని మార్చి మనసులను మార్చివేసింది. చిరకాల వైరాన్ని పక్కనపెడుతూ ఉభయ కొరియాలు శాంతి స్థాపన దిశగా ముందుకు సాగాయి. ఎట్టకేలకు ఉభయ దేశాధినేతలు చేతులు కలిపారు.
ఆ ఇరుదేశాల సరిహద్దు లోని "పన్ముంజుమ్" గ్రామంలోని మూడంతస్థుల భవనం "పీస్ హౌస్" (శాంతి సౌధం) ఈ నవ స్నేహానికి నవశకావిష్కరణకు వేదికైంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 27) ఒక చారిత్రక పరిణామాత్మక సమావేశం జరిగింది. కొరియా యుద్ధం తర్వాత దాదాపు 65సంవత్సరాల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో తొలి సారిగా అడుగు పెట్టడం ఒక అద్భుత విశేషం.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండుదేశాల సరిహద్దు రేఖ వద్ద దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ను కలిశారు. తమ దేశంలోకి రావాలని కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించడంతో మొదట మూన్ జే ఇన్ ఉత్తర కొరియా భూభాగం లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆసక్తి కర పరిణామం చోటుచేసుకుంది. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడవడం కొత్త శకానికి నాంది పలికింది. నవోన్వేషితమైన ఉత్తేజితమైన వాతావరణం నెలకొంది. ఉద్వేగభరితమైన క్షణాలవి. ఎన్నాళ్ళో ఇరుదేశాల ప్రజల హృదయంలో వేసిన వేకువ పల్లవించింది, ప్రభవించింది.
అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా లోకి అడుగుపెట్టారు. సరిహద్దులోని శాంతి సౌథం (పీస్ హౌస్) లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. కిమ్ జోంగ్ ఉన్ తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ జోంగ్ ఉన్... 'తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నాను' అని మూన్ జే ఇన్ తో అన్నారు. ఇరుదేశాల మధ్య కొత్త చరిత్ర లిఖించ డానికి స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య గొప్ప శాంతి ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది ఇరు కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి కానుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ అన్నారు.