హిమాచల్‌ప్రదేశ్ లో దారుణం..మహిళా అధికారిణిని కాల్చివేత!

siri Madhukar
ఈ మద్య మహిళలపై కొంత మంది లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..అయితే న్యాయం కోసం పోరాడే మహిళలు ముఖ్యంగా మహిళా అధికారులపై కొంత మంది వేధింపులు..దాడులు కొనసాగిస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ అధికారులు కసౌలీ పట్టణానికి చేరుకుని.. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు.

ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌ను ఆరు అంతస్తులకు పెంచినందుకు ఆ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. ఈ విషయమై షేల్ బాల.. గెస్ట్ హౌజ్ యజమాని విజయ్ సింగ్, అతని తల్లి మధ్య వాగ్వాదం జరిగింది. భవనాన్ని కూల్చివేయాల్సిందేనని షేల్ బాలా తేల్చి చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన విజయ్ సింగ్ తుపాకీతో పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. 

ఈ ఘటనలో షేలా బాలా అక్కడికక్కడే మృతి చెందగా, మరో అధికారి గులాబ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం విజయ్ సింగ్ సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. పోలీసులు అక్కడే ఉన్పప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, విజయ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడికి త్వరలోనే కఠిన శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే..ప్రభుత్వ ఆదేశాలు అమలు పర్చడానికి వచ్చిన మహిళా అధికారిని కాల్చి చంపడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు కోర్టు ప్రకటించింది. కేసుపై గురువారం వాదనలు విననున్నట్లు ప్రకటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: