కర్నాటక ఎన్నికల సంగతేంటో కానీ దాని ప్రభావం ఏపిలోని ఉద్యోగుల సంఘాలపై బాగానే ప్రభావం చూపుతోంది. చంద్రబాబు పుణ్యమా అంటూ ఉద్యోగ సంఘాల్లోనే కాకుండా ఉద్యోగుల్లో కూడా స్పష్టమైన విభజన వచ్చేసింది. ఏపి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఒంటెత్తుపోకడ వల్ల మామూలు ఉద్యోగుల్లో కూడా చంద్రబాబుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చేస్తోంది. ఉద్యోగుల్లో అశోక్ బాబుపై ఉన్న వ్యతిరేకతకు తాజా సంఘటన ఉదాహరణగా నిలిచింది.
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్బాబు బృందం సమావేశం నిర్వహించింది. ఆ సమావేశమే ఇపుడు వివాదానికి కారణమైంది. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి అశోక్ బాబు ప్రచారం ఎలా చేస్తారంటూ మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎవరి అనుమతి తీసుకుని ప్రచారం చేశారంటూ నిలదీస్తున్నారు.
అశోక్ బాబుపై మండిపడుతున్న తెలుగువాళ్ళు
అశోక్ బాబు వ్యవహారంపై కొందరు ఉద్యోగ నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయటానికి సైతం సిద్ధపడుతున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి అనుకూల, వ్యతిరేకంగాఏపిలోని ఉద్యోగుల్లో స్పష్టమైన చీలిక వచ్చేస్తోంది. దాంతో ఆ విషయంపై తటస్తుల్లో ఆందోళన మొదలైంది. బెంగుళూరు సమావేశంలో హాజరైన పలువురు తెలుగువాళ్ళు కూడా అశోక్ బాబు వైఖరిపై మండిపినట్లు సమాచారం.
ఎన్నికలకు అశోక్ బాబు కు సంబంధమేంటి ?
తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు. చంద్రబాబు చెప్పినట్లు అశోక్బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదన్నారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు.
బిజెపిని ఓడించండంటూ పిలుపు
అశోక్బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు.
టీడీపీ ఏజెంటువా?..విష్ణువర్దన్రెడ్డి ధ్వజం
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబుపై బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేతలకు మొహం చెల్లక అశోక్బాబు లాంటి దళారికి విమాన టిక్కెట్లు ఇచ్చి కర్ణాటకకు పంపించారని ఆరోపించారు.