చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. త్వరలో ఎన్నికలు వస్తున్నందునే చంద్రబాబుకు వ్యతిరేకేంగా అందివచ్చిన ఓటుకునోటు విచారణ అవకాశాన్ని పూర్తిస్ధాయిలో ఉపయోగించుకోవాలని బిజెపి నేతలు నిర్ణయించారు. అందులో భాగంగా ఓటుకునోటు కేసు విచారణ వివరాలను బయటపెట్టాలని, విచారణను త్వరగా పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలంటూ తెలంగాణా సిఎం కెసిఆర్ పై బిజెపి నేతలు ఒత్తిడి పెడుతున్నారు. ఎలాగూ ఇటు చంద్రబాబు అటు కెసిఆర్ ఇద్దరూ కేంద్రప్రభుత్వానికి ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా బహిరంగంగానే పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కేసు విచారణను అడ్డం పెట్టుకుని ఒకేసారి ఇద్దరు సిఎంలపైనా ఒత్తిడి తేవాలన్నది బిజెపి వ్యూహంగా కనబడుతోంది.
శతృవుకు శతృవు మిత్రుడు
తెలుగు రాష్ట్రాల రాజకీయంలో విచిత్ర కోణాలు చాలా ఉన్నాయి. ముందుగా ఇద్దరు ముఖ్యమంత్రులకు ఏమాత్రం పడదు. అదే సందర్భంలో ఏపిలో బిజెపి-టిడిపిల మధ్య చెడింది. మిత్రపక్షాలు కాకపోయినా ప్రస్తుతానికి బిజెపి-వైసిపిలు చంద్రబాబు వ్యతిరేక అజెండాతో పనిచేస్తున్నాయ్. అలాగే, తెలంగాణాలో టిఆర్ఎస్-బిజెపిలకు ఏమాత్రం పడటం లేదు. అలాగే, టిడిపిని తెలంగాణాలో కనిపించకుండా చేయాలని కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బిజెపిలు కెసిఆర్ వ్యతిరేక అజెండాతో పనిచేస్తున్నాయి. ఉండటానికి మిగిలిన పార్టీలు కూడా ఉన్నా వాటి ఉనికి నామమాత్రమే. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో జత కడుతుందో ఇప్పటికైతే స్పష్టత లేదు. కాబట్టే కెసిఆర్ పై ఒత్తిడి తేవటం ద్వారా చంద్రబాబును దెబ్బకొట్టేందుకు బిజెపి నేతలు ప్లాన్లు వేస్తున్నారు.
సుప్రింకోర్టులో ఓటుకునోటు
ఓటుకునోటు కేసు ప్రస్తుతం సుప్రింకోర్టు విచారణలో ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వేసిన కేసును సుప్రింకోర్టు అడ్మిట్ చేసుకుంది. అయితే, కారణాలు స్పష్టంగా తెలీదు కానీ విచారణలో మాత్రం ఆశించినంత పురోగతి కనబడటం లేదు. ఎందుకంటే, కేసును అడ్మిట్ చేసుకుని సుమారు ఐదు మాసాలైనా ఇప్పటి వరకూ విచారణకు నోచుకోకపోవటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అటువంటి దశలో కేసులో కీలకమైన మత్తయ్య కూడా మరో కేసు దాఖలు చేశారు. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఈనెల 14వ తేదీన మొదలవుతుందని సమాచారం.
చంద్రబాబులో ఆందోళన
సరే, కేసు విచారణ, తీర్పు ఎలాగుంటుందో ఇపుడెవరూ చెప్పలేకున్నా చంద్రబాబులో మాత్రం ఆందోళన మొదలైంది. సోమవారం కెసిఆర్ సమీక్షపై అందుబాటులో ఉన్న మంత్రులతో మంగళవారం చంద్రబాబు సమావేశం జరపటంతోనే విషయం అర్దమైపోతోంది. ఎన్నికలకు ముందు కేసులో మళ్ళీ కదలిక కనిపిస్తుండటంతోనే చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. అందుకే కేసును ఎదుర్కొనే విషయంలో న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తానికి ఓటుకునోటు కేసులో త్వరలో మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.