కర్నాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారు ? అన్నది పెద్ద ప్రశ్నకాదు. ఒకవేళ బిజెపి గనుక ఓడిపోతే ఏపిలో టిడిపి పరిస్ధితేంటి ? అన్నవిషయంపైనే పార్టీలో జోరుగా చర్చలు మొదలయ్యాయి. కర్నాటక ఎన్నికల తర్వాత ఏపి రాజకీయాల్లో సంచలన మార్పులుంటాయని బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలతో టిడిపి నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఒక విధంగా టిడిపి నేతల్లో ఆందోళన మొదలైనట్లే కనబడుతోంది. కేంద్రమంత్రివర్గం నుండి తర్వాత ఎన్డీఏలో నుండి తెలుగుదేశంపార్టీ పక్కకు తప్పుకుంది. అక్కడి నుండి చంద్రబాబునాయుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్పష్టంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. అందులో భాగంగానే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు నేతలు కూడా టైం టేబుల్ ప్రకారం మోడి, కేంద్రంపై దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. ఇటువంటి నేపధ్యంలోనే కర్నాటక ఎన్నికలు వచ్చాయి.
ఎటూ కేంద్రంతోను బిజెపితోను చెడింది కాబట్టి టిడిపి నేతలు రెచ్చిపోయారు. వెంటనే కర్నాటకలో వాలిపోయి బిజెపి, మోడిపై తమకున్న అక్కసంతా తీర్చుకున్నారు. కొందరు మంత్రులేమో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరికొందరు మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. మొత్తం మీద బిజెపికి మాత్రం తెలుగువాళ్ళు ఓట్లేయద్దంటూ బహిరంగంగానే మంత్రులు, నేతలంతా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. సరే వారి ప్రభావమేంటో 15వ తేదీ తెలిసిపోతుంది లేండి.
నిజంగానే బిజెపి ఓడితే....
ఒకవేళ బిజెపి నిజంగానే ఓడిపోతే పరిస్ధితేంటి ? అన్న విషయంపై తాజాగా టిడిపిలో చర్చ మొదలైంది. బిజెపిలో ఓడిపోతే కర్నాటకలో బిజెపికి ఏమీ కాదు. అయితే, దాని ప్రభావం ఏపిలో టిడిపిపై ఏ విధంగా ఉండబోతోందో అన్న ఆందోళన కొందరు నేతల్లో కనబడుతోంది. పలు సందర్భాల్లో మోడి, కేంద్రంపై యుద్దం ప్రకటించినట్లు చంద్రబాబు చెప్పిన విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. కర్నాటకలో ఓడిపోయిన బిజెపి ఆ అక్కసంతా ఏపిలోని తమపై చూపిస్తుందేమో అన్న ఆందోళనలో టిడిపి నేతల్లో పెరిగిపోతోంది.
గెలిచినా..ఓడినా సమస్య తప్పదా ?
కర్నాటకలో బిజెపి గెలిచినా, ఓడినా ఏపి విషయంలో మాత్రం తమ పార్టీ వైఖరి ఒకలాగే ఉంటుందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధికారప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ, మరో రెండు నెలల్లో ఏపిలో రాజకీయంగా అనేక మార్పులుంటాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తమ పార్టీ కర్నాటకలో గెలిచినా ఓడినా బిజెపికి వ్యతిరేకంగా మంత్రలు, టిడిపి నేతలు ప్రచారం చేయటాన్ని తమ జాతీయ నాయకత్వం గమనించిందని ఏపి బిజెపినేతలంటున్నారు. అందుకే బిజెపి నేతల బహిరంగ హెచ్చరికలతో టిడిపి నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.