జేడీ(ఎస్) కింగా? కింగ్ మేకరా? కుమార పట్టాభిషేకమా? అంతా కర్-నాటకం


బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు ట్రయాంగులార్ ఫైట్ తో ఒకరి ఎత్తుకు మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కర్నాటక లో అధికారం కైవసం చేసుకోవటానికి  ఏ ఒక్క చాన్సును వదులుకోవటం లేదు. శాసనసభ లోని 222సీట్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (మంగళవారం-15మే) జరుగుతుంది. పూర్తి మెజారిటీ తమదేనని బీజేపీ, కాంగ్రెస్ బీరాలు పోతుంటే జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ మాత్రం తనదే కింగ్-మేకర్ రోల్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

శాసనసభ ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) సంసిద్ధంగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ కూటమి లేదా గ్రూపు ప్రభుత్వాన్నిఏర్పాటు చేయ గలుగుతుంది అనే దాని పై స్పష్టత వస్తుంది. 

వివిధ మీడియా, ఇతర సంస్థలు కలసి నిర్వహించిన 'ఎగ్జిట్ పోల్స్‌' లో 'హంగ్' వస్తుందని అంచనాలు వేసినందున, ఎలాంటి  విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొ నేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి.  మేఘాలయ, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో నిర్లక్ష్యం వలన దొర్లిన తప్పు కర్నాటకలో జరక్కుండా జాగ్రత్త పడెందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తన వ్యూహ ప్రతినిధులు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌ ను ఇప్పటికే బెంగళూరుకు పంపించింది. 

కర్నాటక రాజకీయ అనుసంధాన (ఇంచార్జ్)  బాధ్యతలు నిర్వహిస్తున్న గులాం నబీ ఆజాద్‌ కు జేడీ(ఎస్) నాయకుడు, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ తో మంచి సంబంధాలున్నాయి. కాంగ్రెస్ ఏకైక పెద్దపార్టీగా అవతరించి జేడీ(ఎస్) మద్దతు తీసుకోవలసి వచ్చేపక్షంలో గులాం నబీ ఆజాద్ నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుంద నేది అందరికీ తెలిసిందే. అశోక్ గెహ్లాట్ కూడా జేడీ(ఎస్)తో చర్చలు జరిపే ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. 

హంగ్ పరిస్థితే ఎదురైతే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉండే పరిస్థితులు వస్తాయి. సిద్ధరామయ్యను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు దేవెగౌడ సుతరామూ అంగీకరించరని జగమెరిగిన సత్యం. ఈ కారణం చేతనే వ్యూహాత్మకంగా సిద్ధరామయ్య రెండు రోజుల క్రితం బెంగళూరు లో విలేఖరులతో మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ అధినాయకత్వం భావించేపక్షంలో తనకు ఎలాంటి అభ్యంతరంలేదని ప్రకటించారు. దళిత నాయకుడు, లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారనేది బహిరంగ రహస్యం. 

కర్నాటక  రాజకీయ సమీకరణల్లో వస్తున్న మార్పులను చేర్పులను, తన డేగ కన్నుతో నిశితంగా గమనిస్తూ, ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొందరు సీనియర్ నాయకులను బెంగళూరుకు పంపించారనే మాట వినిపిస్తోంది. వారెవరనేది పరమ రహస్యం. ఇప్పటికే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి  అనంత కుమార్ బెంగళూరులో సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఏకైక పెద్ద పార్టీ గా అవతరించి జేడీ(ఎస్) మద్దతు తీసుకోవలసిన అవసరంవస్తే ఏం చేయాలనేది? అమిత్ షా నిర్ణయం తో సిద్ధం గా ఉన్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకు దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు కూడా బీజేపీ అధినేత  వెనకాడదని అంటున్నారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించే అంశాన్ని అమిత్ షా ఇప్పటికే దేవెగౌడకు దూతల ద్వారా తెలియజేశారని అంటున్నారు. కర్నాటకలో సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా అది దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు తోడ్పడటంతోపాటు 2019లో జరిగే లోక్‌సభఎన్నికల్లో తమకు కలిసి రావాలని  అధినేతలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో 'హంగ్' ఏర్పడే పక్షంలో దేవెగౌడ ఎవరికి చేయూత నిస్తారనేది, ఎవరికి చేయి ఇస్తారనేది పెద్ద చర్చగా మారింది. దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని కలగంటున్నారు.  "కింగ్ మేకర్" పాత్ర నిర్వహించనున్న దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామిని ముఖ్య మంత్రిగా నియమించాలనే లక్ష్యంతోనే రెండు జాతీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపి పరిస్థితులు కలసివస్తే 'కింగ్' అవ్వాలని ఉవ్విళ్ళూరు తున్నారు. చూద్దాం! కుమార పట్టాభిషేకం జరగ వచ్చేమో? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: