ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ అప్పట్లో బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేశారు. జనసేన పార్టీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన పార్టీ ప్రతిష్టను పెంచే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తన ప్రసంగాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు..తాను భవిష్యత్ లో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజకు తెలియజేయనున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లోని ప్రజలకే న్యాయం చేయలేదని... అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలుస్తానని పవన్ తెలిపారు. డబ్బున్న వ్యక్తికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా?. విదేశాల నుంచి వచ్చేవారికి వేల ఎకరాలు ఇస్తున్నారు. సొంత జిల్లా ప్రజలకు న్యాయం చేయాలేరా’’ అని ప్రశ్నించారు.
అంతకుముందు తిరుమలలో రెండు రోజులు బస చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు.
అనంతరం పవన్ గుడిమల్లం పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాల వద్దకు చేరుకున్నారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు.