కర్ణాటక రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వాజూభాయ్ వాలా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. 117 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా కేవలం 104 సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే గవర్నర్ అవకాశం ఇవ్వడం, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోంది. అంతేగాకుండా బలనిరూపణకు ఏకంగా పదిహేను రోజుల గడవు ఇవ్వడంపై ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గోవా, బీహార్లో కర్ణాటక రాజకీయ ఎఫెక్ట్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఏర్పడినా 14 సీట్లు గెలిచిన బీజేపీ ఇతరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అక్కడి గవర్నర్ అతిపెద్ద పార్టీగా అవరించిన కాంగ్రెస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా బీజేపీ కూటమినే ఆహ్వానించారు. ఇప్పుడు కర్ణాటకలో అందుకు భిన్నంగా గవర్నర్ జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని పిలవకుండా అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీని పిలవడంపై గోవా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఇప్పుడు రాజ్భవన్ వరకు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీహార్లోనూ అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ ఏర్పడింది. కానీ, ఆ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అక్కడి గవర్నర్ ఆహ్వానించలేదు. కానీ, నితీశ్కుమార్ నేతృత్వంలోని కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీనిపై ఇప్పుడు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ స్పందించారు. గోవా, బీహార్ ప్రభుత్వాలను రద్దు చేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాకటలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ రాలేదు. 104 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయవం సాధించి, అతిపెద్ద పార్టీ అవతరించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజయవం సాధించి, రెండో స్థానంలో, 38 స్థానాల్లో గెలిచి జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మరో రెండు స్థానాల్లో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఇందులో ఒకరు బీఎస్పీ అభ్యర్థి.
ఇక కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 117 బలం ఉంది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి అవకాశం ఇవ్వకుండా అనూహ్యంగా బీజేపీకే అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉండగా..పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని, ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అసెంబ్లీ, రాజ్భవన్ ఎదుట నిరసనకు దిగారు.