కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి తెలుగుదేశంపార్టీనే కారణమా ? చంద్రబాబునాడు మాటలను వింటే అవుననే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే, మంగళవారం అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసమని బిజెపితో పొత్తు పెట్టుకుంటే నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. బిజెపి రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని తాను తిరుపతి సభలో వివరించటమే కాకుండా కర్నాటక ఎన్నికల్లో కూడా చెప్పారట. నమ్మకద్రోహం చేసిన బిజెపికి వ్యతిరేకంగా తాను పిలుపునిచ్చిన పర్యవసానమే కర్నాటకలో బిజెపి ఓటమి అంటూ చెప్పుకొచ్చారు. అంటే బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయమని చంద్రబాబు చెప్పగానే కర్నాటకలో ఉన్న తెలుగు జనాలందరూ పోలోమంటూ కాంగ్రెస్, జెడిఎస్ లకు ఓట్లు వేశారని చంద్రబాబు చెబుతున్నారు. పైగా కర్నాటకలో బిజెపి ఓడిపోయినందుకు తాను చాలా సంతోషించినట్లు కూడా చంద్రబాబు చెబుతుండటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు చెప్పింది నిజమేనా ?
నిజానికి చంద్రబాబు చెప్పిందంతా నిజమేనా ? చంద్రబాబు పిలుపుకు స్పందించి కర్నాటకలో తెలుగు వాళ్ళంతా బిజెపికి వ్యతరేకంగా ఓట్లు వేశారా ? ఫలితాలను చూస్తే చంద్రబాబు చెప్పిందంతా పచ్చి అబద్దమన్న విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే మొన్నటి ఎన్నికల్లో బిజెపికి దాదాపు రెట్టింపు సీట్లు వచ్చాయి. పైగా మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బిజెపికి 104 స్ధానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 78 రాగా జెడిఎస్ 38 స్ధానాలతోనే సరిపెట్టుకుంది. వాస్తవాలు ఇలా వుండగా చంద్రబాబు మాత్రం పూర్తిగా అబద్దాలు చెబుతున్నారు. అంతేకాకుండా కర్నాటకలో తెలుగు, తమిళ ఓటర్లున్న చాలా ప్రాంతాల్లో బిజెపి మెజారిటీ సీట్లు సాధించినట్లు విశ్లేషణలు బట్టి అర్ధమవుతోంది.
ఒకటి జరిగితే ఇంకోలా ప్రచారం చేసుకోవటం అలవాటే
కర్నాటకలో జరిగింది ఒకటైతే చంద్రబాబు, టిడిపి నేతలు మరొకలాగ ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు . అంటే, వారికి అది మొదటి నుండి అలవాటే. ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా మలుచుకోవటంలో, ప్రచారం చేసుకోవటం చంద్రబాబుకైనా, టిడిపి నేతలకు బాగా అలవాటు. ప్లస్ లన్నీ తమ ఖాతాలోను వైఫల్యాలను ఎదుటివారి ఖాతాలోనూ వేసేయటం మొదటి నుండి అందరూ చూస్తున్నదే. ఇపుడు కూడా జరిగింది అదే. ఎటుతిరిగి తామేమి చెప్పినా గుడ్డిగా మద్దతిచ్చే మెజారిటీ మీడియా చేతుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పినా చెల్లుబాటైపోతోంది.
చంద్రబాబు పిలుపును ఖాతరు చేయని తెలుగు ఓటర్లు
నిజానికి కర్నాటక ఎన్నికల్లో చంద్రబాబు మాటను ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజంగా చంద్రబాబు పిలుపుకు తెలుగు ఓటర్లు సానుకూలంగా స్పందించి ఉంటే కాంగ్రెస్సే మంచి మెజారిటీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. కానీ అలా జరగలేదు కదా ? అంటే చంద్రబాబును తెలుగు ఓటర్లు ఏమాత్రం ఖాతరు చేయలేదన్న విషయం అర్ధమైపోతుంది. అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాలో బిజెపిని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ పిలవగానే చంద్రబాబు అండ్ కోలో ఆందోళన మొదలైన మాట వాస్తవం. ఏదో అదృష్టం కొద్దీ మూడు రోజుల్లో బిజెపి ప్రభుత్వం పడిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బిజెపి ప్రభావం ఈపాటికి ఏపిలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబు మీద కనబడేదేమో కూడా.