క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రైవేటు రంగంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అయ్యేట్లుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో జరుగుతున్న రచ్చ అంతా అందరూ చూస్తున్నదే. ఒకవైపు అధికార టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఎంఎల్ఏ రాచకొండ ప్రసాద్ రెడ్డి కూడా రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అంతటితో ఆగకుండా వైసిపి, వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్టీల్ అథాకిటీ ఆఫ్ ఇండియా (సైల్) పెద్దగా ఆశక్తి చూపటం లేదని సమాచారం.
గాలికి అవకాశం దక్కుతుందా ?
మరి, సైల్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటు కాకపోతే ప్రత్యామ్నాయంగా ప్రైవేటు రంగమొకటే దిక్కు. అందుకే బ్రాహ్మణీ స్టీల్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిజేపి నేత గాలి జనార్ధన రెడ్డి ముందుకొచ్చారు. ఇప్పటికే ఫ్యాక్టరీ పేరుతో తాను కడప స్టీల్ ఫ్యాక్టరీపై దాదాపు రూ. 1300 కోట్లు ఖర్చు చేసిన కారణంగా ఫ్యాక్టరీ ఏర్పాటు అవకాశం తనకే ఇవ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. గాలికి ఫ్యాక్టరీని అప్పగించటం చంద్రబాబునాయుడుకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని అంతర్జాతీయ బిడ్డింగులు పిలవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆద్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కూడా పెద్దగా ఆశక్తి చూపటం లేదని అర్ధమవుతోంది. అంటే ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఇటు రాష్ట్రం అటు కేంద్రం రెండు కూడా ఒకే దిశలో ఆలోచిస్తున్నాయి.
ప్రైవేటు వైపే ప్రభుత్వాల మొగ్గు
అదే సందర్భంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సైల్ ముందుకు రాకపోతే గనుల కేటాయింపులో నిబంధనలు మార్పుకు సిద్ధమంటూ కేంద్ర గనులు, ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ ప్రకటించటం గమనార్హం. ప్రైవేటు సంస్ధ సొంత అవసరాలకు మాత్రమే (క్యాప్టివ్ మైనింగ్) గనులను యాజమాన్యం ఉపయోగించుకోవాలని కూడా అరుణా చెప్పారు. సో, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రం కూడా ప్రైవేటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఓకే అనేట్లే ఉన్నాయి. కాబట్టి త్వరలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కథ సుఖాంతం కావచ్చని ఆశిద్దాం.
బయటపడిన లోకేష్ అజ్ఞానం
తొందరపడి కోయిల ముందే కూసినట్లుగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో నారా లోకేష్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం రాయితీలేవీ ఇవ్వదంటూ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో లోకేష్ కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఒకవైపు రాయితీలాస్తాం, ప్రోత్సాహకాలిస్తాం రమ్మంటూ ప్రపంచ దేశాలను చంద్రబాబు ఆహ్వానిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి, కడప ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో మాత్రం రాయితీలేవీ ఇవ్వమని చెప్పటంలో అర్ధమేంటి ? ఫ్యాక్టీరీ ఏర్పాటు కావటమన్నది ఇపుడు చంద్రబాబుకు అత్యం ప్రతిష్టగా మారింది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనా లేకపోతే ప్రైవేటు రంగమా అన్నది అప్రస్తుతం. ఏ పద్దతిలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్దమైనా తమ పోరాటం వల్లే ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని చంద్రబాబు చెప్పుకుంటారు. కాబట్టి ప్రైవేటు కూడా అన్నీ రాయితీలివ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.