చంద్రబాబునాయుడు ముస్లిం ఓట్లపై కన్నేశారు. చంద్రబాబు ఏది చేసినా ఏదో పరమార్ధం లేనిదే చేయరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా అదే సూత్రాన్ని వర్తింపచేస్తున్నారు. ఎలాగంటే, తాజాగా ముస్లింలను దువ్వుతున్నారు. త్వరలో ఓ ముస్లిం అభ్యర్ధికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారంటూ ఫీలర్లు వదులుతున్నారు.
ప్రస్తుత మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా చోటు ఇవ్వకుండా చంద్రబాబు రికార్డు సృష్టించారు. బహుశా నాలుగేళ్ళపాటు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన ఫలితమేమో ? ఎందుకంటే, బిజెపితో ఉన్నంత కాలం తాను కూడా ముస్లింలకు వ్యతిరేకతమే అని మోడి, అమిత్ షా లు గుర్తించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం కావచ్చు. అందుకనే ఫిరాయింపు ముస్లిం ఎంఎల్ఏలున్నా, టిడిపి ఎంఎల్సీలున్నా వారివైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ముస్లింలపై గురిపెట్టిన చంద్రబాబు
హటాత్తుగా ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో పాటు సాధారణ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబుకు హటాత్తుగా ముస్లింలు గుర్తుకువచ్చారు. ఈమధ్యనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నేతలతో జరిగిన సమావేశంలో తమ ప్రభుత్వం ముస్లింలకు చేస్తున్న సాయాన్ని ప్రచారం చేయాలంటూ గట్టిగా చెప్పారు. అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. ముస్లింల ఓట్లపై చంద్రబాబు గురిపెట్టారన్న విషయం అర్ధమైపోతోంది. పోయిన ఎన్నికల్లో ముస్లింలలో అత్యధికులు వైసిపికి ఓట్లేసినట్లు సమాచారం. అందుకనే టిడిపి తరపున పోటీ చేసిన అభ్యర్ధుల్లో ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. సరే, తర్వాత వైసిపి తరపున గెలిచిన జలీల్ ఖాన్, చాంద్ భాషాలను టిడిపిలోకి లాక్కున్నారనుకోండి అది వేరే సంగతి.
ఉద్దరించని ఫిరాయింపు ఎంఎల్ఏలు
మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా చోటు కల్పించకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఇబ్బందే అని చంద్రబాబుకు అర్దమైపోయింది. ఎందుకంటే, ఫిరాయింపు ఎంఎల్ఏలు జలీల్ ఖీన్, చాంద్ భాషాలకు టిక్కెట్లు ఇచ్చేది అనుమానమే అంటున్నారు. ఒకవేళ ఇచ్చిన గెలవరని చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లోనే తేలిపోయిందట. దాంతో వాళ్ళేదో ఉద్దరించేస్తారనుకుంటే చంద్రబాబుకు గుదిబండలాగ తయారయ్యారు. దాంతో టిడిపిలోనే ఉన్న ఎంఏ షరీఫ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారట. అదే సమయంలో శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ గురించి కూడా ఆలోచిస్తున్నారట. జలీల్, నౌమన్ తదితరులకు కార్పొరేషన్లలో స్ధానం కల్పించిన విషయం గమనించాలి. ఏదేమైనా టిడిపిలోని ముస్లిం మైనారిటీ సెల్ ను యాక్టివేట్ చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓట్లన్నీ టిడిపికే పడాలన్నది చంద్రబాబు వ్యూహంగ కనబడుతోంది.