టిఆరెస్ ఎమ్మెల్యేలకు "అదే" లేదంట

బిజెపి తెలంగాణా విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లుంది. అందుకే వ్యూహకర్తల్లో ఒకరైన రాం మాధవ్ టిఆరెస్ అధినేత కెసిఆర్ రాజకీయతంత్రాలను పసిగట్టినట్టే ఉన్న దాఖలాలు కని పిస్తున్నాయి. ఒకవైపు బిజెపితో నాటకం, మరోవైపు టిడిపితో నాకటం, మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బాజా వాయించటం. ఏమిటో ఈ లీల .... ఇదంతా అవగాహన చేసుకునే కావచ్చు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మగతనం లేదని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ కలవరం కలిగించే అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆధికారం కోసం వారు వారి  ఆడబిడ్డలను కూడా బెదిరించడానికి వెనుదీయరని తూర్పారబట్టారు. 

ఒక కౌన్సిలర్‌ కూతుర్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు బెదిరించిన నీచ సంస్కృతిని ఉనికిని చాటుకున్నారని ఆరోపించారు. ‘మీ నాన్న మా మాట వినకుంటే బాగోదు!’ అంటూ ఆ కౌన్సిలర్‌ కూతుర్ని వసతి గృహానికి రప్పించి మరీ బెదిరిస్తుంటే, ఆ ఆడకూతురు భయంతో వణికిపోతూ  ‘అలాగే అంకుల్‌’ అనడాన్ని చూసి తాను చలించిపోయానని, దాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. 

రాష్ట్రంలో బెదిరింపులతో గూండాల రౌడీల  పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీ జనచైతన్య యాత్ర గురువారం వరంగల్‌కు చేరుకున్న సందర్భంగా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించిన సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌పై, దాని అధినేత, రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి శాలువా, పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగుతారని, తెలంగాణలో దిగ గానే మస్లిజ్ కు జీ-హుజూర్‌ అంటూ గోడ మీద పిల్లి వైఖరి కేసీఆర్‌ ప్రదర్శిస్తుంటారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ తమకు ఎప్పుడూ మిత్రపక్షం కాదని, శత్రుపక్షమేనని స్పష్టం చేశారు.

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ తదితరపనుల్లో కమీషన్లు పర్సెంటేజీల ప్రాతిపదికన వసూళ్ళు చేయటం ప్రభుత్వం సంప్రదాయంగా మార్చేసిందని దుయ్యబట్టారు. సిరిసిల్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించారని ఉదహరించారు.  25శాతం పర్సెంటేజీలుగా నిర్ణయిస్తే అందులో మంత్రికి మూడు శాతం ఇవ్వాల్సిందేనని బహిరంగంగానే చెప్పడాన్ని రాంమాధవ్‌ ప్రస్తావిస్తూ, ‘సిరిసిల్ల మంత్రి ఎవరో తెలుసుగా!’  అంటూ పరోక్షంగా రాష్ట్ర ఐటి మంత్రి, ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు కేటీఆర్‌ను ఉటంకిస్తూ ఆరోపణలు గుప్పించారు. అవినీతి పరంగా తెలంగాణరాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు.

అసోంలో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో పాగా వేయలేమా! అని అన్నారు. 2022 వరకు నవ భారతాన్ని నిర్మించే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళుతోందని, దేశానికి వర్తమానం, భవిష్యత్తు బీజేపీయేనని స్పష్టం చేశారు రాంమాధవ్. నాలుగేళ్ల లో రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతిని పెంచి పోషించారని ఆరోపించారు

తెలంగాణాలో 2019 లో టీఆర్‌ఎస్‌ ను ఓడించే సామర్ధ్యం, సత్తా కాంగ్రెస్ కు లేదని, బీజేపీకి మాత్రమే అది సాధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. భూ కబ్జాలు, దందాలు, పర్సంటేజీలు, కమీషన్లు, వంచన, మోసపూరిత కుటుంబ పాలనపై ప్రజాకోర్టు లో కేసీఆర్‌ సర్కారు పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు పరకాల జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నా బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, అందులో భాగంగానే పంటలకు మద్దతు ధరను పెంచిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. 


ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్‌, ప్రభాకర్‌ - నేతలు ప్రేమేందర్‌ రెడ్డి, ఎడ్ల అశోక్‌ రెడ్డి, ధర్మా రావు టి.రాజేశ్వరరావు, జంగారెడ్డి, రావుపద్మ తదితరులు పాల్గొన్నారు. జన చైతన్యయాత్ర తొలిదశ శుక్రవారం ముగియనుంది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో భారీ బహిరంగసభ నిర్వహించను న్నారు. ఈ సభకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, మురళీధర్‌రావు, కృష్ణదాస్‌, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: