హైకోర్టు రాకపోవడానికి కారణం చంద్రబాబేనా..!
ఆంధ్రప్రదేశ్ కుహైకోర్టు ఏర్పాటుచేసే విషయంలో ఎలాంటి తుది గడువు లేదంటూ.. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. విభజన చట్టంలో పదేళ్లపాటూ హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా ఉంచుకోవాలని స్పష్టంగా సూచించిన నేపథ్యంలో హైకోర్టు విభజనకు గడువు లేదని తేల్చేశారు. హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భవనాలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా కల్పించాల్సి ఉన్నదని, హైకోర్టు ఏపీ ప్రభుత్వం కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
విబజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో ప్రస్తు వాస్తవాలను తెలియజేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు వివరాలను అందించింది. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... ఏపీలో హైకోర్టు ఏర్పాటు విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా అది ఏపీ ప్రభుత్వానిదే అని తేలుస్తున్నట్లుగా ఈ వివరాలు ఉన్నాయి. హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు నుంచి వచ్చిన న్యాయమూర్తుల బృందానికి కొన్ని భవనాలను చూపించింది. వాటితో వారు సంతృప్తి చెందలేదు. కొత్త భవనాన్ని నిర్మిస్తాం అంటూ కొన్ని డిజైన్లను కూడా చూపించారు. వాటికి హైకోర్టు ఓకే చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు తరువాత అడుగు పడలేదు.